టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందనే తరుణంలో మరోసారి ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా ఇరాన్లో ట్రంప్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్గా చేసుకొని ఓ వివాదాస్పద హోర్డింగ్ను ప్రదర్శనకు ఉంచారు. మధ్య టెహ్రాన్లోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన ఈ భారీ బ్యానర్పై "రక్తానికి రక్తం" అనే నినాదాన్ని పర్షియన్ భాషలో రాశారు.
ఇరాన్ ప్రతీకార జ్వాలతో రగిలిపోతుంది. తమ దేశాధినేత మాజీ సుప్రీంలీడర్ ఆయతుల్లా ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో చంపడంతో ఆ దేశం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు ట్రంప్ను చంపేస్తామంటూ నినాదాలు హోరెత్తాయి. తాజాగా టెహ్రాన్లో ట్రంప్ను చంపేస్తామంటూ బ్యానర్ వెలిసింది.
ఈ బ్యానర్లో వెనుక భాగంలో అమెరికా అధ్యక్ష భవనం 'వైట్ హౌస్' తగలబడుతున్నట్లు చూపించారు. దాని ముందర అమెరికా ఫ్లాగ్తో కప్పబడిన శవపేటికలపైన డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్తో పాటు ఆయన ఐదుగురు పిల్లలు—ఇవాంకా, డాన్ జూనియర్, ఎరిక్, టిఫానీ, మరియు బారన్ ట్రంప్ల చిత్రాలను ముద్రించారు.
ట్రంప్ను హెచ్చరిస్తూ ఇరాన్ ఇలాంటి హోర్డింగ్ను ఏర్పాటు చేయడం ఇది రెండవసారి. అంతకుముందు టెహ్రాన్లోని ఎంగెలాబ్ స్క్వేర్లో ట్రంప్ శవపేటికలో పడుకుని ఉన్నట్లు ఒక బిల్ బోర్డ్ను ఏర్పాటు చేశారు. ఆ చిత్రంలో ట్రంప్ జుట్టు చెల్లాచెదురై, కళ్ళు, నోరు మూసి ఉండి, ఎర్రటి టైపై చేతులు పెట్టుకుని శవపేటికలో ఉన్నట్లు చూపించారు.
వ్యూహాత్మక ప్రచారం
టెహ్రాన్లోని వలియాస్ర్ స్క్వేర్లో ఉండే ఇలాంటి పెద్ద పెద్ద మురల్స్ (గోడచిత్రాలు) అన్నింటినీ 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్'తో సంబంధం ఉన్న 'ఓజ్ ఆర్ట్స్ అండ్ మీడియా ఆర్గనైజేషన్' రూపొందిస్తుంది. ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ దళాలతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, ఇరాన్ తన సంప్రదాయ విప్లవాత్మక ఇమేజరీ, యుద్ధ స్మారకాలు, లాజికల్ సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టెహ్రాన్లోని బిజీ రోడ్లపై ఇలాంటి భారీ బిల్ బోర్డులను వాడుతోంది.
మోజ్తబా ఖమేనీ హెచ్చరిక
గత వారం ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ తన టెలిగ్రామ్ ఛానల్లో మాట్లాడుతూ, తన తండ్రి హత్యకు ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటామని ప్రకటించారు. "ఈ ప్రతీకారం మా దేశం యొక్క డిమాండ్. దీనికి కారణమైన నేరగాళ్లు (పై స్థాయి నుండి కింది స్థాయి వరకు అందరి పేర్లు మాకు తెలుసు) తమ బెడ్లపై ప్రశాంతంగా ప్రాణాలు వదలలేరు. ఆ కోరిక తీరకుండానే వారు సమాదుల్లోకి వెళ్తారు" అని హెచ్చరించారు.
ఇరాన్ను బాంబులతో ముంచెత్తండి: ట్రంప్
మరోవైపు, ఇరాన్ తనను ఒకవేళ విజయవంతంగా హత్య చేస్తే, ఆ దేశాన్ని ఊహించని స్థాయిలో బాంబులతో ముంచెత్తాలని డొనాల్డ్ ట్రంప్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. న్యూయార్క్ పోస్ట్ తో ట్రంప్ మాట్లాడుతూ.. "నేను చాలా కాలంగా ఇరాన్ హిట్ లిస్ట్లో ఉన్నాను. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే, వారు ఎన్నడూ చూడని స్థాయిలో ఇరాన్పై బాంబుల వర్షం కురిపించాలని నేను ఇప్పటికే స్పష్టమైన సూచనలు ఇచ్చాను" అని పేర్కొన్నారు.
రగులుతున్న యుద్ధ జ్యాలలు
మరోవైపు ఇరాన్పై పెద్ద ఎత్తున సైనిక దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఇందుకోసం అమెరికా రాబోయే రోజుల్లో డజన్ల కొద్దీ రీఫ్యూయలింగ్ (ఇంధనాన్ని నింపే) విమానాలను ఇజ్రాయెల్కు పంపుతోందని ఆక్సియోస్ (Axios) నివేదిక పేర్కొంది. రాబోయే కొద్ది రోజుల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.


