హైదరాబాద్: బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు, స్థానికులు, సీసీ కెమెరాల ద్వారా గుర్తించి పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.
గోల్కొండ జోన్ అడిషనల్ కమిషనర్ కృష్ణ గౌడ్, కుల్సుంపురా ఏసీపీ తిరుపతి వివరాల ప్రకారం.. జియాగూడ డబుల్ బెడ్రూమ్లలో ఉంటున్న అబ్బుల్ అజీజ్ (55) రెడ్హిల్స్లోని నీలోఫర్ ఆసుపత్రి వద్ద చాయ్ అమ్ముతుంటాడు. భార్య, పిల్లలు వదిలేయడంతో తల్లి గౌసియా బీ వద్దే ఉంటున్నాడు. మద్యానికి బానిసయ్యాడు.
గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ అంతస్తులో మైనర్ (9) ఒక్కతే ఉన్నది గమనించి అసభ్యంగా ప్రవర్తించాడు. అదే అంతస్తులోకి వచ్చిన మరో వ్యక్తి అజీజ్ను చూసి బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.
సీసీ కెమెరాల్లో పరిశీలించి బయటకు వెళ్లిన అబ్బుల్ అజీజ్ సాయంత్రం 6 గంటలకు తిరిగి రావడంతో అతడికి దేహశుద్ధి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 11 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


