టెస్ట్ క్రికెట్లో పాకిస్తాన్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో పాక్ 90 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 211 పరుగుల లక్ష్య చేధనలో పాకిస్తాన్ కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజం(58 నాటౌట్) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
ఈ ఓటమితో పర్యాటక జట్టు రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-0 తేడాతో వెనకబడింది. సిరీస్లో వెనకబడడమే కాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(2025-27) పాయింట్ల పట్టికలోనూ ఆఖరి స్దానానికి పాక్ పడిపోయింది. ఈ సైకిల్లో పాకిస్తాన్కు ఇది వరుసగా నాలుగో ఓటమి. వారి పాయింట్ల శాతం (PCT) 8.33% నుంచి 6.67%కి దిగజారింది.
దీంతో వచ్చే ఏడాది జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించే అవకాశాలను పాకిస్తాన్ దాదాపు కోల్పోయినట్లే. పాక్ జట్టుకు ప్రస్తుత సైకిల్లో ఇంకా నాలుగు టెస్ట్లు మాత్రమే ఉన్నాయి. ఈ మ్యాచ్లు అన్ని గెలిచినా పాక్ ఫైనల్ అర్హత సాధించడం కష్టమే అనే చెప్పాలి. ఈ భారీ విజయంతో వెస్టిండీస్ తమ పాయింట్ల శాతాన్ని (PCT) 15% నుంచి 22.73%కి మెరుగుపరుచుకుంది.
కానీ పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ సైకిల్లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్లలో 2 విజయాలు, 7 ఓటములతో కరేబియన్ జట్టు 8వ స్థానంలోనే కొనసాగుతోంది. ఇక పట్టికలో ఆస్ట్రేలియా (87.50)అగ్రస్దానంలో ఉండగా.. సౌతాఫ్రికా(75.00) రెండో స్ధానంలో కొనసాగుతోంది. ఇక భారత్(48.15) ఐదో స్ధానంలో నిలిచింది.
భారత్ ఫైనల్ చేరాలంటే?
ఈ సైకిల్లో శుబ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఇంకా 9 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. శ్రీలంకతో రెండు, న్యూజిలాండ్తో రెండు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్లో తలపడనుంది. ఒక్క మ్యాచులోనూ ఓడిపోకుండా.. కనీసం ఏడింట్లో గెలిస్తే ఫైనల్కు చేరే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఆసీస్, కివీస్ వంటి బలమైన జట్లను ఓడించాలంటే భారత్ సమిష్టిగా రాణించక తప్పదు. ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది.
చదవండి: WI vs PAK 1st Test: పాకిస్తాన్ ఘోర ఓటమి.. 120 పరుగులకే ఆలౌట్


