కామన్వెల్త్ గేమ్స్లో రన్నర్ గుల్వీర్ సింగ్కు రజతం
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత అథ్లెట్స్ పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ చారిత్రాత్మక విజయం సాధించాడు. పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో అతడు రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో ఈ విభాగంలో పతకం గెలుచుకున్న తొలి భారత పురుష అథ్లెట్గా రికార్డులకెక్కాడు.
ఆఖరి క్షణాల్లో అద్భుతం
ఉత్కంఠభరితంగా సాగిన ఈ రేసులో 28 ఏళ్ల గుల్వీర్ ఆఖరి క్షణాల్లో అద్భుతం చేశాడు. చివరి ల్యాప్లో అనూహ్యమైన వేగంతో ముందుకు దూసుకెళ్లిన గుల్వీర్.. 27 నిమిషాల 49.78 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్సన్ (27:48.93) స్వర్ణ పతకం సాధించగా.. ఐల్ ఆఫ్ మ్యాన్కు చెందిన డేవిడ్ ముల్లార్కే కాంస్య పతకం ఒడిసి పట్టాడు.
వర్షంలోనూ తగ్గని జోరు
కాగా స్కాట్స్టౌన్ స్టేడియంలో ఈ పరుగు పందం తీవ్ర ప్రతికూల వాతావరణంలో జరిగింది. రేసు సమయంలో భారీ వర్షం కురిసింది. నీటితో ట్రాక్ తడిసిపోయింది. అయినప్పటికి గుల్వీర్ తన పట్టుదలను వీడలేదు. మొదటి నుంచీ అగ్రస్థానంలో ఉన్న అథ్లెట్ల గుంపుతోనే సాగుతూ టాప్-2లో నిలిచాడు.
అయితే ఈ విభాగంలో ఎప్పుడూ ఆధిపత్యం చెలాయించే కెన్యా, ఉగాండా అథ్లెట్లకు ఈసారి పతకాలు దక్కకపోవడం విశేషం. 1986 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత పురుషుల 10,000 మీటర్ల విభాగంలో ఒక్క ఆఫ్రికన్ అథ్లెట్ కూడా పతకం గెలవకపోవడం ఇదే మొదటిసారి. కాగా ఉత్తరప్రదేశ్కు చెందిన గుల్వీర్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలోని గ్రెనేడియర్స్ రెజిమెంట్లో నాయిబ్ సుబేదార్గా పనిచేస్తున్నాడు.
మరోవైపు భారత వెయిట్ లిఫ్టర్ హర్జిందర్ కౌర్ సైతం సత్తాచాటింది. మహిళల 69 కేజీల విభాగంలో మొత్తం 227 కేజీల (స్నాచ్లో 101 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 126 కేజీలు) బరువును ఎత్తి సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. దీంతో ఈ క్రీడల్లో భారత పతకాలు సంఖ్య 12కు చేరింది.


