కెప్టెన్లు మారినా పాకిస్తాన్ క్రికెట్ జట్టు రాత మాత్రం మారడం లేదు. పాక్ టెస్టు పగ్గాలను తిరిగి చేపట్టిన తొలి మ్యాచ్లోనే బాబర్ ఆజంకు తీవ్ర నిరాశ ఎదురైంది. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన మొదటి టెస్ట్లో 90 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఘోర ఓటమిని చవిచూసింది.
వెస్టిండీస్ నిర్ధేశించిన 211 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక బాబర్ సేన చతికల పడింది. కరేబియన్ జట్టు బౌలర్లు చెలరేగడంతో పాక్ కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజం(58 నాటౌట్) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
8 మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. విండీస్ పేసర్ జేడెన్ సీల్స్ 5 వికెట్లు పడగొట్టి పాక్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు కీమర్ రోచ్, గ్రీవ్స్ తలా రెండు వికెట్లు సాధించారు. నాలుగో రోజు ఆటలో 93/7 ఓవర్నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ను టెయిలాండర్లు, షమార్ జోసెఫ్(38), కెమర్ రోచ్లు(18) ఆదుకున్నారు.
వీరిద్దరూ 8వ వికెట్కు విలువైన 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరికి విండీస్ రెండో ఇన్నింగ్స్లో 238 పరుగులకు ఆలౌటై పాక్ ముందు ఫైటింగ్ టార్గెట్ను ఉంచింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేక పర్యాటక జట్టు ఘోర పరాభవం పాలైంది. కాగా పాక్ బౌలర్లలో మహమ్మద్ అబ్బాస్ ఐదు వికెట్లతో సత్తాచాటాడు.
అంతకుముందు వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 311 పరుగులు చేయగా.. అనంతరం 282 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్లో పాక్ మాజీ కెప్టెన్ షాన్ మసూద్(109) సెంచరీతో కదం తొక్కాడు. కానీ రెండో ఇన్నింగ్స్లో మాత్రం మసూద్ విఫలమయ్యాడు. ఇక ఈ ఓటమితో పాక్ జట్టు (6.66% పీసీటీ) డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆఖరి స్దానానికి పడిపోయింది.


