source: X
జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ విజయంతో భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు.
మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల ద్వైపాక్షిక టీ20 సిరీస్లో జింబాబ్వేపై 3-0తో క్లీన్స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్గా రికార్డు నెలకొల్పాడు. తద్వారా ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. అంతకుముందు పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ మాత్రమే జింబాబ్వేపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల టీ20 సిరీస్ను క్లీన్స్వీప్ చేశాయి.
జింబాబ్వేపై టీ20 సిరీస్ క్లీన్స్వీప్లు
* పాకిస్తాన్ – 3-0 (2020)
* ఆఫ్ఘనిస్తాన్– 3-0 (2021)
* ఆఫ్ఘనిస్తాన్ – 3-0 (2022)
* ఆఫ్ఘనిస్తాన్ – 3-0 (2025)
* **భారత్** – 3-0 (2026)
ధోనికి కూడా సాధ్యపడలేదు..!
2010లో సురేశ్ రైనా నేతృత్వంలో భారత్ జింబాబ్వేపై 2-0తో సిరీస్ గెలిచినా, అది రెండు మ్యాచ్ల సిరీస్ మాత్రమే. 2015లో అజింక్య రహానే సిరీస్ను 1-1తో సమం చేయగా, 2016లో ఎంఎస్ ధోని నాయకత్వంలో భారత్ 2-1తో విజయం సాధించింది.
2024లో శుభ్మన్ గిల్ సారథ్యంలో భారత్ 4-1తో సిరీస్ గెలిచింది. అయితే మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ చరిత్రలో నిలిచాడు.
ఊరటనిచ్చిన విజయం
టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్కు కెప్టెన్సీ ఆరంభం నిరాశాజనకంగా సాగింది. ఐర్లాండ్తో 0-2, ఇంగ్లండ్తో 0-4 తేడాతో వరుస సిరీస్ల్లో భారత్ పరాజయం పాలైంది. తొలి ఏడు మ్యాచ్ల్లో (ఒకటి ఫలితం లేకుండా) ఆరు ఓటములు ఎదుర్కొన్న భారత కెప్టెన్గా అయ్యర్ అవాంఛిత రికార్డు నమోదు చేశాడు.
అయితే జింబాబ్వేపై 3-0 సిరీస్ విజయం శ్రేయస్ అయ్యర్కు, అలాగే భారత జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఫలితంగా నిలిచింది. రానున్న కఠిన సిరీస్లలో ఇదే జోరును కొనసాగించాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.


