థామస్ కప్, ఉబెర్ కప్ ‘డ్రా’ విడుదల
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లకు భిన్నమైన ‘డ్రా’లు ఎదురయ్యాయి. 2022లో తొలిసారి థామస్ కప్ చాంపియన్గా నిలిచిన భారత పురుషుల జట్టు ఈసారి స్థాయికి తగ్గట్టు ఆడితే క్వార్టర్ ఫైనల్ చేరుకోవడం ఖాయం. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, కెనడా, ఆ్రస్టేలియా జట్లతో భారత్కు చోటు కల్పించారు. చైనాను మినహాయిస్తే కెనడా, ఆ్రస్టేలియా జట్లపై భారత్ విజయాన్ని ఊహించవచ్చు. రెండు విజయాలు సాధిస్తే భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకుంటుంది.
మరోవైపు ఉబెర్ కప్లో భారత మహిళల జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, ఆతిథ్య దేశం డెన్మార్క్, ఉక్రెయిన్ జట్లతో భారత్ తలపడాల్సి ఉంటుంది. ఉక్రెయిన్పై టీమిండియా సులువుగా గెలవచ్చు. కానీ చైనా, డెన్మార్క్ జట్లపై భారత్ విజయావకాశాలు స్వల్పమే. ఈ నేపథ్యంలో భారత్ క్వార్టర్ ఫైనల్ చేరాలంటే చైనా లేదా డెన్మార్క్ జట్లలో ఒకదానిపై ఖచ్చితంగా నెగ్గాలి.
భారత మహిళల జట్టు 2014, 2016లలో సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. రెండు విభాగాల్లో 16 జట్ల చొప్పున పాల్గొనే థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీ ఏప్రిల్ 24 నుంచి మే 3 వరకు డెన్మార్క్లోని హోర్సెన్స్ నగరంలో జరుగుతుంది. 2024 థామస్ కప్, ఉబెర్ కప్ టోర్నీలో భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో చైనా చేతిలో... భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో జపాన్ చేతిలో ఓడిపోయాయి.


