ఓర్లియాన్స్ ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని జోడీ శుభారంభం చేసింది. ఫ్రాన్స్లో బుధవారం జరిగిన తొలి రౌండ్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ ద్వయం 21–15, 21–9తో త్సాయ్ ఫు చెంగ్–సుంగ్ యు సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మాజీ నంబర్వన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ 12–21, 10–21తో మాగ్నస్ జొనాసెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు.
భారత్కే చెందిన ఆయుశ్ శెట్టి 17–21, 21–10, 21–17తో సహచరుడు కిరణ్ జార్జ్పై గెలిచాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్ల్లో మాళవిక బన్సోద్ 21–18, 21–14తో సుంగ్ షువో యున్ (చైనీస్ తైపీ)పై, ఇషారాణి బారువా 21–19, 21–19తో అమెలీ షుల్జ్ (డెన్మార్క్)పై, అన్మోల్ 21–12, 21–16తో నెష్లిహాన్ అరిన్ (టర్కీ)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. భారత్కే చెందిన ఆకర్షి కశ్యప్, దేవిక సిహాగ్, రక్షితశ్రీ తొలి రౌండ్లోనే ఓడిపోయారు.


