ముంబై: లాస్ ఏంజెలిస్ మెగా ఈవెంటే మా అందరి లక్ష్యమని భారత టాప్ ర్యాంక్ స్క్వాష్ ప్లేయర్ అనాహత్ సింగ్ తెలిపింది. 2028 ఒలింపిక్స్లో తొలిసారి స్క్వాష్ క్రీడకు చోటు లభించింది. ఈ నేపథ్యంలో క్రీడాకారులంతా వచ్చే రెండేళ్ల పాటు ఒలింపిక్ కలను సాకారం చేసుకునేందుకే శ్రమిస్తారని చెప్పింది.
ప్రతి అథ్లెట్ కల
ఇండియా ఓపెన్ టోర్నీలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘స్క్వాష్ తొలిసారి ఒలింపిక్స్లో భాగమవడం... ముమ్మాటికి ఉత్సాహాన్ని పెంచే విషయం. క్రీడాకారులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు మాకు (స్క్వాష్ ప్లేయర్లకు) కామన్వెల్త్ క్రీడలే మేజర్ ఈవెంట్గా ఉంది.
ఇప్పుడు విశ్వక్రీడల్లో ఆడే అవకాశం లాస్ ఏంజెలిస్ ద్వారా దక్కనుంది. ఒలింపిక్ పతకమనేది ప్రతి అథ్లెట్ కల. దీన్ని సాకారం చేసుకునేందుకే ఏళ్ల తరబడి శ్రమిస్తారు. దీర్ఘకాలిక లక్ష్యంతో దేశానికి పతకం తేచ్చేందుకు నేను చెమటోడ్చుతాను’ అని వివరించింది.
కాగా 2023 ఏషియాడ్లో రెండు కాంస్య పతకాలు గెలుపొందిన అనాహత్ ఈ ఆసియా క్రీడలకు ఇంకా సమయం ఉండటంతో ప్రస్తుతం జరిగే టోర్నీలపై దృష్టి సారిస్తానని చెప్పుకొచ్చింది. అయితే ఈసారి ఆసియా క్రీడల్లో మరింత మెరుగైన ప్రదర్శనతో పతకం రంగు మారుస్తానని తెలిపింది.
సన్నాహక టోర్నీగా
ఇండియా ఓపెన్ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) కాపర్ ఈవెంట్గా జరుగుతోంది. ఇందులో రాణించిన ప్లేయర్లకు ర్యాంకింగ్ పాయింట్లు మెరుగవడమే కాకుండా ఈ ఏడాది జరగబోయే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలకు ముందు మేటి సన్నాహక టోర్నీగా ఉపయోగపడుతుంది.
పురుషుల కేటగిరీలో భారత రెండో ర్యాంకింగ్ ప్లేయర్ రమిత్ టాండన్ మాట్లాడుతూ స్క్వాష్ తాజాగా ఒలింపిక్ క్రీడ కావడంతో కార్పోరెట్ సంస్థలు సైతం ఆకట్టుకుంటోందని, తద్వారా ఆటగాళ్లకు స్పాన్సర్షిప్ అండదండలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.


