సాక్షి హైదరాబాద్ : రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు తుదిదశకు చేరుకుంది. ఈ రోజు( శనివారం) శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యే.. దానం నాగేందర్ను విచారించనున్నారు. ఈ అంశంలో ఇది వరకే నాగేందర్ విచారణ చేపట్టాల్సి ఉండగా పలు కారణాలతో ఈ రోజుకు వాయిదాపడింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టనున్నారు.
ఇక ఎమ్మెల్యే కడియం శ్రీహరి విచారణ ఇది వరకే పూర్తవగా తీర్పును రిజర్వు చేశారు. గత నెలలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మూడు వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని ఫిబ్రవరి 6వ తేదీన హెచ్చరించింది.
ఈ క్రమంలోనే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కు మరో అవకాశం ఇచ్చింది. అనర్హత అంశాన్ని తేల్చాలని ఇప్పటికే స్పీకర్కు చాలా సమయం ఇచ్చామని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. అనర్హత పిటిషన్లపై విచారణ పూర్తిచేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పీకర్ను ఆదేశించింది. ఇక దానం నాగేందర్ విచారణతో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తవుతుంది.


