నిజామాబాద్ జిల్లా : మంజీర నది తీర సమీపంలోని నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హున్స గ్రామంలో ‘పిడిగుద్దులాట’ఉత్కంఠ భరితంగా సాగింది. శతాబ్దానికి పైగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం హున్స గ్రామస్తుల ఐకమత్యం, పోలీసుల పర్యవేక్షణలో ఈ ఏడాది పిడిగుద్దులాటను విజయవంతంగా నిర్వహించారు. సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు గ్రామస్తులు, ప్రేక్షకుల కేరింతలు, చప్పట్ల నడుమ పిడిగుద్దులాట కొనసాగింది. అనంతరం గ్రామపెద్దలు ఆట ముగిసినట్లు ప్రకటించగా గ్రామస్తులంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. పిడిగుద్దులాటను తిలకించేందుకు మహారాష్ట్ర వాసులు, బోధన్ డివిజన్లోని పలు ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ విజయ్బాబు, ఎస్ఐ మచ్చేందర్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.





