మంచిర్యాల జిల్లా: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను కట్టడి చేసేందుకు పోలీసులు ఉపయోగిస్తున్న ఈ–చలాన్ల విధానంలో అప్పుడప్పుడు దొర్లుతున్న పొరపాట్ల కారణంగా తప్పు చేయని వారికి శిక్షలు పడుతున్నాయి. ఫొటోలు తీసి జరిమానా విధించే క్రమంలో నంబర్లు సరిగా గుర్తించకపోవడంతో ఒకరు చేసిన తప్పునకు మరొకరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
రెండ్రోజుల క్రితం ఏం జరిగిందంటే..
మంచిర్యాల జిల్లాలో రెండు రోజుల క్రితం మందమర్రి సమీపంలో ఒక వాహనదారుడు హెల్మెట్ ధరించలేదని పోలీసులు ఫొటో తీశారు. అయితే, ఆ ఫొటో ఆధారంగా చలాన్ జనరేట్ చేసే సమయంలో సిబ్బంది నిర్లక్ష్యమో లేదా సాంకేతిక లోపంతో నో వాహనం నంబర్ తప్పుగా నమోదైంది. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన వాహన దారుడికి కా కుండా 65 కిలోమీటర్లు దూరంలోని దండేపల్లి మండలం తాళ్లపేట బస్టాండ్ సమీపంలో నిలిపి ఉంచిన ఏ తప్పు చేయని వాహనదారుడికి జరిమానా విధించినట్లు మెసేజ్ వెళ్లింది.
దీంతో అతను వెంటనే ఈ–చలాన్ ఓపెన్ చేసి చూడగా, మందమర్రిలో ఉన్న వాహనాన్ని ఫొటో తీస్తే నాకు జరిమానా రావడం ఏమిటని ఆశ్చర్య పోవడమే కాకుండా ఇదేమిటని తలపట్టుకున్నాడు. దీనికి ఎవరు బాధ్యులు, నేను చేయని తప్పునకు జరిమానా ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తున్నాడు. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి సాంకేతిక లోపాలను సరిదిద్ది, చలాన్లు విధించే ముందు నంబర్ ప్లేట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని బాధితులు కోరుతున్నారు.


