రైతు భరోసా వస్తుందా.. రాదా? | Telangana Farmers Worried Over Delay In Raithu Bharosa Payment | Sakshi
Sakshi News home page

రైతు భరోసా వస్తుందా.. రాదా?

Mar 7 2026 11:59 AM | Updated on Mar 7 2026 12:25 PM

Telangana Farmers Worried Over Delay In Raithu Bharosa Payment

నల్లగొండ అగ్రికల్చర్‌ : యాసంగి సీజన్‌ రైతు భరోసా ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు. యాసంగి సీజన్‌ ముగిసి నెలరోజులు దాటింది. మరో 10, 15 రోజుల్లో నాన్‌ ఆయకట్టు ప్రాంతంలో వరి కోతలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం రైతు భరోసాపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా దాగుడు మూతలు ఆడుతుంది. గత యాసంగిలో రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని జనవరి 26న రైతుల ఖాతాల్లో ఎకరానికి 6 వేల చొప్పున జమ చేసిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుత యాసంగిలో రైతు భరోసా ఇంకా ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో జమ చేస్తుందో చేయదో అన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. 

5,16,327 ఎకరాల్లో యాసంగి సాగు..
ప్రస్తుత యాసంగి సీజన్‌ జిల్లా వ్యాప్తంగా 5,16,327 ఎకరాల్లో వరితో పాటు వివిధ పంటలు సాగయ్యాయి. వరి సుమారు 5 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. పెట్టుబడుల సమయంలో రైతుభరోసా అందక రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. పొలాలు దున్నకం, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, వరి నాట్ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్టుబడి కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకుని యాసంగి సాగును పూర్తి చేశారు. రైతు భరోసా వస్తుందనే ఆశతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టారు. రైతు భరోసా డబ్బులు వస్తే కొంత ఆసరాగా ఉండేది. కానీ ప్రభుత్వం దానిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

5,65,803 మంది రైతులు..
జిల్లా వ్యాప్తంగా 5,65,803 మంది పట్టాదారు పాస్‌ పుస్తకాలున్న రైతులు ఉన్నరు. ఎకరాలకు 6 వేల చొప్పున రూ.738.67 కోట్లు ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. కానీ రైతు భరోసాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా నిధులను జమ చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

పెట్టుబడి సాయం ఇస్తే అప్పులు తీర్చుకుంటాం
ప్రభుత్వం స్పందించి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలి. యాసంగి సీజన్‌ సాగు కోసం పెట్టుబడుల కోసం ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేశాం. రైతు భరోసా నిధులు జమ చేస్తే అప్పులు తీర్చుకుంటాం. రైతుల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి వెంటనే రైతు భరోసా ఇవ్వాలి. 
– చిమట భిక్షమయ్య, రైతు, గుండ్లపల్లి, నల్లగొండ మండలం

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement