గట్టుపొడిచినవాగు వద్ద ట్రాప్ కెమెరాకు చిక్కిన పెద్ద పులి
30 మీటర్ల దూరం నుంచి పులిని చూసి మూర్ఛపోయిన బీట్ అధికారి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి నిజామాబాద్ జిల్లాలోకి వచ్చిన పెద్ద పులి ప్రస్తుతం కమ్మర్పల్లి రేంజ్ పరిధిలోని గట్టుపొడిచినవాగు ప్రాజెక్టు బ్యాక్వాటర్ ప్రాంతంలో సేదతీరుతోంది. గురువారం తెల్లవారుజామున అటవీ శాఖ అమర్చిన ట్రాప్ కెమెరాకు పెద్ద పులి కదలికలు చిక్కడంతో కచ్చితంగా నిర్ధారణ అయింది. మహారాష్ట్రలోని తడోబా అడవి నుంచి వచ్చిన ఈ పులి కొన్ని నెలలుగా ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో సంచరిస్తోంది.
మూడు రోజుల క్రితం కమ్మర్పల్లి రేంజ్లోకి వచ్చిన ఈ పులి ఇదేచోట వన్యప్రాణిని చంపి తిని, ఇక్కడే దాహార్తిని తీర్చుకుని సేద తీరుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పెద్ద పులి కదలికలపై పూర్తి స్థాయి సమాచారం కోసం అటవీ అధికారులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. గట్టుపొడిచినవాగు బ్యాక్వాటర్ ప్రాంతంలో గురువారం అటవీ అధికారుల బృందం పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంలో బీట్ అధికారి శ్రీదేవికి అలసట రావడంతో అక్కడే ఉన్న కల్వర్టు మీద కూర్చున్నారు.
ఇది గమనించకుండా బృందంలోని మిగిలిన సభ్యులు కొంత ముందుకు వెళ్లారు. ఇదే సమయంలో వెనుక వైపు 30 మీటర్ల దూరంలో అలికిడి వినిపించడంతో శ్రీదేవి ఆవైపు చూడగా, పెద్ద పులి నడిచి వెళుతూ కనిపించింది. దీంతో ఆమె అక్కడికక్కడే మూర్ఛపోయారు. కల్వర్టుకు ఇవతలివైపు పడిపోయారు. అధికారుల బృందం తక్షణమే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కల్వర్టుకు అవతలివైపు పడిపోయి ఉంటే పులికి ఆహారం అయ్యేదానినని శ్రీదేవి విలపిస్తుండటంతో అధికారులు సైతం భయాందోళనకు గురవుతున్నారు.
ఏ బిడ్డా.. ఇది నా అడ్డా
మన్ననూర్: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో పెద్ద పులులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. అటవీ శాఖ చేపట్టిన జంగిల్ సఫారీలో భాగంగా పర్యాటకులకు తరచూ పెద్ద పులులు కనిపిస్తూ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి విధుల్లో భాగంగా సఫారీ వాహనంలో వెళ్తున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి.. గుండం వద్ద చెట్ల పొదల నుంచి వచ్చిన పెద్దపులి కనిపించింది. సఫారీ వాహనం దీపాలను ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డుపైనే ఠీవిగా నడుచుకుంటూ సాగిపోయింది. దీంతో అధికారులు తమ సెల్ఫోన్లలో పులి కదలికలను వీడియోలు తీశారు.
కెమెరాకు చిక్కిన చిరుతపులి
బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కరత్వాడ గ్రామ శివారులోని లక్కాయి లొద్ది వద్ద చిరుతపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. రెండు రోజుల క్రితం కరత్వాడ గ్రామానికి చెందిన ద్యాగాల గంగయ్యకు చెందిన ఆవు.. లక్కాయి లొద్ది వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీనిని చిరుత దాడిగానే భావించిన అటవీ శాఖ అధికారులు అక్కడ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం 5.29 గంటల ప్రాంతంలో ఆవు కళేబరాన్ని చిరుత తింటున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఆవును చంపింది చిరుతేనని అటవీ అధికారులు ధ్రువీకరించారు. చిరుత సంచారం దృష్ట్యా అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పశువుల కాపరులు, వృద్ధులు అడవిలోకి వెళ్లవద్దని సూచించారు.


