వాంతులు తగ్గించడానికి చికిత్సకు రూ.65 వేలు వసూలు హెర్నియా శస్త్రచికిత్సకు రూ.1.30 లక్షలు ‘ఆరోగ్య బీమా’తో ఆసుపత్రుల దోపిడీ అనవసర మందుల వాడకం ఇన్పేషెంటుగా చేర్చడంతో ఆసుపత్రిలో బాధితుల అవస్థలు లేనిపోని మానసిక అశాంతి ఆరోగ్యబీమాతో తప్పని కొత్త సమస్యలు
ఆరోగ్యబీమా ఉన్న వ్యక్తులు ఏదైనా అనారోగ్యంతో తమ దగ్గరకు వస్తే, కొన్ని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నాయి. రోగులతో మైత్రీభావంతో వ్యవహరిస్తూ నిజాయతీగా చేయాల్సిన వైద్యవృత్తిలో కొందరు అధిక సంపాదనకు అర్రులు చాస్తున్నారు. ఆరోగ్య బీమా ఉన్న రోగుల చికిత్స వారికి ఇంకా లాభసాటి వ్యవహారంగా మారింది.
తెనాలి: ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ ఒకరు ఆసుపత్రికి రావటంతోనే కాంపౌండర్లు ఆరా తీస్తున్నారు. అతడు ఎక్కడ ఉంటున్నాడు? ఏం ఉద్యోగం చేస్తున్నారు? అంటూ వివరాలు సేకరిస్తున్నారు. ఆసుపత్రి బిల్లు కార్పొరేట్ స్థాయిలో ఉంటుందన్న విషయం చెప్పనవసరం లేదు. ఇక ఆరోగ్య బీమా ఉందని చెప్పిన వెంటనే వైద్యం చేసే తీరు మరోరకంగా ఉంటుంది. చిన్న రోగానికి కూడా ఇన్పేషెంటుగా అడ్మిట్ చేస్తున్నారు. అనవసర పరీక్షలు, స్కానింగులు చేయించి బిల్లును తడిసి మోపెడు చేస్తున్నారు. మందులు కూడా ఎక్కువ రాస్తున్నారనే అభియోగాలున్నాయి. చివరకు రూ.లక్షల్లో బిల్లును చేతిలో పెడుతున్నారు.
ఇవిగో నిదర్శనాలు...
ఉన్నా లేనట్టు చూపి మరీ..
ఆరోగ్య బీమా వైద్యంలో క్లెయిం ఏవిధంగా చేసుకోవాలనే అంశంపై బీమా కంపెనీల కన్సల్టెంట్లను డాక్టర్లు సంప్రదిస్తున్నారు. అడ్మిషను టైములో, డిశ్చార్జి చేసేటప్పుడు ఎలాంటి పారామీటర్స్ ఉండాలనేది తెలుసుకుంటున్నారు. ఆ ప్రకారమే క్లెయిములు పెడుతున్నారు. ఉదాహరణకు రోగికి పరీక్షల్లో షుగర్ అని ఉంటే బీమా రాదనేది ఒక పారామీటరు అనుకుందాం... ల్యాబ్ పరీక్షల్లో ఆ రోగికి షుగర్ అని వచ్చినప్పుడు, సదరు డాక్టరే ల్యాబ్ టెక్నీషియన్తో మాట్లాడి షుగర్ లేనట్టుగా రిపోర్టులో నమోదు చేయిస్తున్నారు. ఇలా పరీక్షల రిపోర్టులనూ మార్చేస్తున్నారు. డైపర్, దూది, కేనల్ వంట బీమా పరిధిలోకి రానివాటికి అదనంగా వసూలు చేస్తున్నారు.
‘నేను డయాగ్నైజ్ చేస్తాను...బీమా కంపెనీ చికిత్స చేస్తుంది’ అన్నట్టుగా కంపెనీ పారామీటర్ల ప్రకారం జరిగే వైద్యంలో రోగికి అనవసర మందులతో అనర్థాలు, ఇన్పేషెంటుగా ఆసుపత్రిలో ఉండాల్సి రావటం, లేనిపోని పరీక్షలతో బిల్లుల భారం అనివార్యంగా మారుతోంది. దీనికితోడు మానసిక అశాంతి. ఆరోగ్యబీమాలో చిన్నపాటి వైద్యానికే రూ.లక్షన్నర ఖర్చయితే, అనుకోని రీతిలో తర్వాత మరేదైనా ఆరోగ్య సమస్య వస్తే బీమా మొత్తం సరిపోక, అప్పులు చేయాల్సి వస్తుందేమోనన్న బెంగతో చివరకు ఆరోగ్యబీమాపై ఉండటం మంచిదేనా? అన్న సందేహం వస్తోందని స్థానిక వ్యాపారి ఒకరు అన్నారు. ఇదే అంశంపై రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ పార్లమెంటులో చేసిన సూచన ప్రకారం వైద్యంలో నైతికత, పారదర్శకత కోసం ఆసుపత్రులపై తగిన పర్యవేక్షణ ఉండటం చాలా అవసరం.


