‘మీరు ఒడిశా రాష్ట్రం నుంచి ఇంత దూరం రెండు ప్రాక్టికల్ పరీక్షల కోసం రావాల్సిన అవసరం లేదు. రూ.10 వేలు ఇస్తే పూర్తి మార్కులతో పాస్ చేయిస్తాం’.. ఇదీ పల్నాడు జిల్లాలోని ఒక బీఈడీ కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ సందేశం. దీనిపై విశ్వసనీయ సమాచారం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో బీఈడీ కళాశాల ప్రాక్టికల్ పరీక్షల పేరుతో రూ.10 లక్షల వరకు వసూలు చేస్తుండగా, అందులో నుంచి రూ. 2 లక్షలు మామూళ్లు ఇవ్వాలని బీఈడీ కళాశాలల యాజమాన్యాలు ఏజెంట్లకు చెబుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసుల కోసం బీఈడీ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహణ తీరు ప్రహసనంగా మార్చారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ పరిధిలో బీఈడీ 2024–26 ప్రాక్టికల్ పరీక్షలు మొదటి విడత మార్చి 11న, రెండో విడత మార్చి 16న, మూడో విడత మార్చి 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 60కి పైగా బీఈడీ కళాశాలల్లో దాదాపు 7 వేల మంది విద్యార్థులు ఈ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రకాశం జిల్లాలో సప్లిమెంటరీ విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏఎన్యూ పరిధిలో జరుగుతున్న పరీక్షల నిర్వహణ తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యావంతులు సైతం బీఈడీ ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్ష పేపర్లో ఒకే ప్రశ్న మూడు సార్లు ముద్రించడం, ప్రశ్నపత్రాల్లో తప్పులు ముద్రించడం వంటి సంఘటనలను చర్చించుకుంటున్నారు. నిర్వాహకుల తీరులో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. తప్పులు జరిగినట్లు గుర్తించినా ఉన్నతాధికారులు సైతం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పరీక్షల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాసే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించకుండా, వర్సిటీ పరిధిలోని అనేక కళాశాలలు రూ.లక్షలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒడిశా, అస్సాం, కేరళ, బిహార్, బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి 4,500 మందికి పైగా విద్యార్థులు బీఈడీ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. వారి ప్రయాణ, వసతి ఖర్చులు, ప్రాక్టికల్ ఫీజులలో కొంత మొత్తం ఇస్తే నూటికి నూరు శాతం పాస్ చేయిస్తామని కళాశాలలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పల్నాడు జిల్లాలోని ఒక బీఈడీ కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్ నేతృత్వంలో ఈ తరహా అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనేక కళాశాలలు ప్రాక్టికల్స్కు హాజరు కాని ఒక్కో విద్యార్థి నుంచి రూ.5,000 నుంచి రూ.10,000 వరకు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాక్టికల్స్కు హాజరయ్యే విద్యార్థుల నుంచి రూ.2,000 నుంచి రూ.5,000 వరకు వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. పల్నాడు ప్రాంతంలోని ఒక బ్రోకర్, కళాశాలల్లో వసూలైన డబ్బులతో ప్రయోగ పరీక్షలు నిర్వహించకుండానే గత కొంతకాలంగా వ్యవహారం ముగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బీఈడీ ప్రాక్టికల్స్లో కోట్ల రూపాయల విద్యా వ్యాపారం జరుగుతున్నప్పటికీ, సరైన పర్యవేక్షణ లేకపోవడం సమస్యగా మారింది. తనిఖీ బృందాలుగా బీఈడీ కళాశాలల సిబ్బందినే నియమించడం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట లేకుండా పోయిందని విమర్శలు ఉన్నాయి. గతంలో బీఈడీ ప్రాక్టికల్స్కు ప్రత్యేక పరిశీలకులను నియమించేవారు. వర్సిటీ స్క్వాడ్స్, ఆబ్జర్వర్ల నియామకం కోసం కోఆర్డినేటర్ అనే పదవిని ఏర్పాటు చేసి, వారి ద్వారా తనిఖీ బృందాలను నియమించేవారు. అప్పట్లో పరీక్షలు పారదర్శకంగా జరిగేవని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ వ్యవస్థ లేకపోవడం గమనార్హం. గతంలో బీఈడీ కళాశాలల్లో సీనియర్ లెక్చరర్లను సబ్జెక్టుల వారీగా నియమించేవారు. ప్రస్తుతం కళాశాలలు పరస్పర మార్పిడి ద్వారా నియామకాలు జరపడంతో అసలు బీఈడీ విద్యార్హత లేని వారిని అబ్జర్వర్లుగా నియమించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, విద్యాశాఖాధికారులు స్పందించి పరీక్షల నిర్వహణ, ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ నిబంధనల మేరకు నిర్వహించాలని విద్యావేత్తలు, విద్యార్ధులు, తల్లిదండ్రులు పరీక్షల పేరుతో జరుగుతున్న అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని విద్యార్ధులకు న్యాయం చేయాలని విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఏఎన్యూ పరిధిలో డబ్బు చాటున బీఈడీ ప్రయోగ పరీక్షలు బీఈడీ కళాశాలలు కూడా యథేచ్ఛగా నగదు వసూలు
‘మీరు ఒడిశా రాష్ట్రం నుంచి ఇంత దూరం రెండు ప్రాక్టికల్ పరీక్షల కోసం రావాల్సిన అవసరం లేదు. రూ.10 వేలు ఇస్తే పూర్తి మార్కులతో పాస్ చేయిస్తాం’.. ఇదీ పల్నాడు జిల్లాలోని ఒక బీఈడీ కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ సందేశం. దీనిపై విశ్వసనీయ సమాచారం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో బీఈడీ కళాశాల ప్రాక్టికల్ పరీక్షల పేరుతో రూ.10 లక్షల వరకు వసూలు చేస్తుండగా, అందులో నుంచి రూ. 2 లక్షలు మామూళ్లు ఇవ్వాలని బీఈడీ కళాశాలల యాజమాన్యాలు ఏజెంట్లకు చెబుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాసుల కోసం బీఈడీ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహణ తీరు ప్రహసనంగా మార్చారు.
బీఈడీ యాజమాన్యాల దందా
కేంద్రాల నిర్వహణపై కరువైన పర్యవేక్షణ