కౌన్సిల్ ఆమోదించిన పనులు కూడా జరగడం లేదు తుది కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు
న్యూస్రీల్
అమరజీవికి నివాళి
మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026
I
రేపల్లె: కారుమూరులో వేంచేసియున్న లలితా పరబ్రహ్మేశ్వరి సమేత అమరలింగేశ్వరస్వామి వారికి సోమవారం విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,800, గరిష్ట ధర రూ.9,500, మోడల్ ధర రూ.8,500 వరకు పలికింది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.6755 టీఎంసీలు.
పట్నంబజారు(గుంటూరుఈస్ట్): గత కౌన్సిల్ ఆమోదించిన పనులు నిలిచిపోయాయి..కాంట్రాక్టర్లు స్పందించడం లేదు..అంటూ పలువురు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల చుట్టూ తిరిగినా.. అదిగో ఇదిగో అంటున్నారే తప్ప.. పనులు జరగటం లేదన్నారు. పాలకవర్గం పదవీ కాలం ముగి యనున్న నేపథ్యంలో సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన చివరి సమావేశం నిర్వహించారు.
కొద్ది మందికే కాంట్రాక్టు పనులు
పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి
కొద్దిమంది కాంట్రాక్టర్లే అత్యధిక శాతం పనులు తీసుకున్నారని, అయితే పనులు మాత్రం చేయటంలేదని పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆరోపించారు. అధికారుల భాగస్వామ్యంతో కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారని అన్నారు. క్వాలిటీ, నిర్ణీత సమయంలో పనులు చేసిన వారికి మాత్రం బిల్లుల చెల్లింపు జరగటం లేదని, బిల్లులు చెల్లించని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. వేసవిలో తాగునీటి సమస్య ఉన్న మాట వాస్తమేనని, పలు ప్రాంతాల్లో ఇబ్బందికరర పరిస్థితులు ఉన్నాయన్నారు. అనేక డివిజన్లలో బోరింగ్లు కూడా పనిచేయని పరిస్థితి ఉందని అన్నారు. నగరంలో అనధికారిక హోర్డింగ్స్ ఉన్నాయని, వాటికి అధికారులు ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎల్ఈడీ బల్బులు పెడుతున్నారని, దాని వలన ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్లో ఆశీలు వసూలు చేస్తున్నారని ఇది ఎవరూ వసూలు చేయిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. నగరంలో కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దీనిని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీసం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఒక్క నెల వ్యవధిలోనే దాదాపు 3వేల మందిని కుక్కలు కరిచాయని, పశ్చిమ నియోజకవర్గంలోనే 900 మంది ఉన్నారనని తెలిపారు.
పూడికతీత పనులతో ఇబ్బందులు
తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్
కాలువల్లో పూడికతీత కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. నగరంలో కుక్కల సమస్య అధికంగా ఉందని, దీనిపై అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదని ప్రశ్నించారు. పాతగుంటూరు, ఏటుకూరు రోడ్డులోని శ్మశానవాటికలు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. సచివాలయాల్లో పలు వస్తువులు పనిచేయటంలేదని సిబ్బంది చెబుతున్నారని తెలిపారు.
మొక్కల టెండర్లలో అవకతవకలు
కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి
మొక్కల టెండర్లలో అనేక అవకతవకలు జరిగాయని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి ఆరోపించారు. పనులు పూర్తయిన వాటికి కూడా టెండర్లు వేసి కొంత మంది అధికారులు, ప్రజాప్రతినిధులు డబ్బులు కై ంకర్యం చేశారని అన్నారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు 2024 సెప్టెంబర్ నుండి ఎంత వరకు బిల్లులు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
అధికారులకు కృతజ్ఞతలు
మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ నగరంలోని 57 డివిజన్ పరిధిలో అభివృద్ధి చేయటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈస్ట్లో 532 పనులు రూ.270 కోట్లు, వెస్ట్లో రూ.290 కోట్ల పనులు మంజూరు చేశామని, వాటిలో రూ.140 కోట్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. బీఆర్ స్టేడియం, శంకర్విలాస్ బ్రిడ్జి, తక్కెళ్లపాడు ఆర్వోబీ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావించి అభివృద్ధికి కృషి చేశానని తెలిపారు. 14 ప్రియాంబుల్స్, ఒక ప్రతిపాదనను ఆమోదించటం జరిగిందన్నారు. అనంతరం కమిషనర్ మయూర్ అశోక్ను సత్కరించి, షీల్డ్ను అందజేశారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మేయర్ చుక్కా ఏసురత్నం, మాజీ కార్పొరేటర్ పోతురాజు సుబ్బరావమ్మ మృతికి సంతాపంగా మౌనం పాటించారు.
ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం
గుంటూరు నగరంలో కేవలం రెండేళ్లలోనే అభివృద్ధి జరిగినట్లు చెబుతున్నారని, ఎవరి హయాంలో నగర అభివృద్ధి జరిగిందనేది రికార్డులు చెబుతాయని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం అన్నారు. పాలకవర్గం పదవీ కాలం ఐదేళ్లలో మూడేళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ఆ సమయంలో అభివృద్ధి జరిగిందన్న వాస్తవం ప్రజలకు తెలుసునన్నారు. మూడేళ్లలో 25వ డివిజన్ పరిధిలో రూ.50 కోట్లకుపైగా పనులు జరగడమే అందుకు నిదర్శనమన్నారు. నగరంలో జరిగిన అభివృద్ధికి సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో అనధికారిక లే అవుట్లు పెరిగిపోతున్నాయని దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హాస్టల్స్ భద్రతపై అధికారులు దృష్టి సారించాలని, ప్రైవేట్ వసతి గృహాల్లో శానిటేషన్, ఒకే రూములో ఐదారుగురు ఉండటం వంటివి గమనించి చర్యలు తీసు కోవాలన్నారు.
కూటమి కార్పొరేటర్ల వాగ్వాదం
ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం మాట్లాడుతున్న క్రమంలో కొంత మంది కూటమి కార్పొరేటర్లు ఆయన ప్రసంగాన్ని ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకోవాలని చూశారు. వైఎస్సార్ సీపీ హయాంలో సింహ భాగం అభివృద్ధి జరిగిందని చెప్పటంతో ఆయనతో వాగ్వాదానికి దిగారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కూడా ప్రతి వాదనకు దిగారు. కూటమి ఎమ్మెల్యే మాట్లాడుతున్న సమయంలో తాము అడ్డుపడలేదని, కానీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్న సమయంలో ప్రసంగానికి అడ్డురావటం భావ్యం కాదని చెప్పటంతో వివాదం సర్దుమణిగింది.


