నగరంపాలెం: రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యునిగా వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి గెలుపొందారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి ఫలితాలను ప్రకటించారని ఆదివారం బ్రహ్మారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 13న ఏపీలో రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 141 మంది పోటీ చేయగా, అందులో 31 మంది మహిళా న్యాయవాదులు కూడా బరిలో నిలిచారు. అయితే బార్ కౌన్సిల్ సభ్యునిగా బ్రహ్మారెడ్డి 1,409 ఓట్లతో విజయం సాధించారు. ఆయన బార్ కౌన్సిల్ సభ్యునిగా గెలవడం ఇది మూడోసారి. గెలుపునకు సహకరించిన ఏపీలోని న్యాయవాదులకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. బ్రహ్మారెడ్డిని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సీడీ భగవాన్, పట్టణ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కాసు వెంకట రెడ్డి, న్యాయవాదులు అలికపల్లి శ్రీనివాసరెడ్డి తదితరులు అభినందించారు. 1991లో న్యాయవాది వృత్తిలోకి ప్రవేశించిన బ్రహ్మారెడ్డి గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా, బార్ కౌన్సిల్ క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్గా, గత ప్రభుత్వ హయాంలో స్పెషల్ పీపీగా పనిచేశారు.


