● డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి ● వయోజనుల అక్షరాస్యత వార్షిక పరీక్ష కేంద్రాల తనిఖీ
యడ్లపాడు: మండలంలోని 22 గ్రామాల్లో ఆదివారం అక్షర ఆంధ్ర–అక్షర పల్నాడు కార్యక్రమంలో భాగంగా అధికారులు వయోజనులకు పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల నిర్వహణ పరిశీలనకు జిల్లా డీఆర్డీఏ పీడీ పి.ఝాన్సీరాణి అకస్మికంగా మండలాన్ని సందర్శించారు. మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రలో జరిగే పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ మండలంలో 2200 మంది వయోజనులు అక్షరాభ్యాసం చేస్తున్నారని వీరిలో 1670 మంది డ్వాక్రా సభ్యులు కాగా, 530 మంది ఉపాధి కూలీలు ఉన్నట్లు తెలిపారు. చదువుపై వయోజనులు చూపుతున్న ఆసక్తిని ఆమె అభినందించారు. చదువు లేని డ్వాక్రా మహిళలు, ఉపాధి హామీ కూలీలు తమ రోజువారీ ఆర్థిక లావాదేవీల్లో మోసపోకుండా ఉండేందుకే ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. పొదుపు సంఘాల్లో డబ్బుల లెక్కలు తెలుసుకోవడం, ఉపాధి హామీ కూలీ డబ్బుల లెక్కలు చూసుకోవడం ,బ్యాంకు చెక్కులపై సొంతంగా సంతకాలు చేయడం వంటి అంశాల్లో స్వయం సమృద్ధి సాధించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్యోద్దేశమని ఆమె పేర్కొన్నారు. మండల ఎంపీడీవో ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షలకు వందశాతం హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఎంపీడీవో వి.హేమలత, డెప్యూటీ ఎంపీడీఓ షేక్ జాకీర్హుస్సేన్, సచివాలయ మండల అధికారి నాగిరెడ్డి, ఏపీఎం కె.రవీంద్రకుమార్, ఏపీఓ డి.సుందరరావు, సీసీలు వై.పెద్దయ్య, సిహెచ్. నాగేశ్వరరావు, జి.నాగేశ్వరరావు, ఎం.ద్రాక్షాయమ్మ పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు, మహిళా పోలీసులు, వెల్ఫేర్ అసిస్టెంట్లు ఇన్విజిలేటర్లుగా వ్యవహరించారు.


