నరసరావుపేట: గౌరవ వేతనంతో విశేష సేవలు అందిస్తున్న అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని, లేనిపక్షంలో తమ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించక తప్పదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) పల్నాడు జిల్లా గౌరవ అధ్యక్షురాలు గుంటూరు మల్లేశ్వరి హెచ్చరించారు. పట్టణంలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో శనివారం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏఎల్ ప్రసన్న అధ్యక్షతన యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. మల్లీశ్వరి మాట్లాడుతూ తమ వేతనాలు పెంచాలనే దశలవారీ పోరాటాలలో భాగంగా ఇటీవల ఛలో విజయవాడ కార్యక్రమం చేపడితే అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం దుర్మార్గం అన్నారు. యూనియన్ నాయకులతో నిర్వహించిన చర్చల సందర్భంగా ప్రభుత్వ పెద్దలు 10 డిమాండ్లకు గాను తొమ్మిది నెరవేర్చామని అబద్ధాలు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉగాది సందర్భంగా పండగ నాటికి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె సందర్భంగా శిబిరానికి వచ్చిన కూటమి అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని ఊక దంపుడు ఉపన్యాసాలు చేసి అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శాంతమణి కోశాధికారి మాధవి, సభ్యులు సావిత్రి, జయలక్ష్మి పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు జి.మల్లేశ్వరి


