నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : గుంటూరు నగరంలోని నల్ల చెరువులో కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నారులపై దాడులకు తెగబడుతున్నాయి. కొద్దిరోజుల కిందట నల్లచెరువులో ముగ్గురు చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. ఆ చిన్నారులు ఆసుపత్రుల్లో చికిత్స పొంది ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డారు. ఆ సందర్భంలో నల్లచెరువు వాసులంతా కార్పొరేషన్ కార్యాలయం వద్దకు వచ్చి కమిషనర్ చాంబర్ ఎదుట ఆందోళన చేశారు. అధికారులు వారికి నచ్చచెప్పి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా మంగళవారం మరో బాలుడి పై కుక్కలు దాడి చేసి గొంతు, తలపై గాయపరిచాయి. దీంతో బాలుడిని వెంటనే కుటుంబ సభ్యులు పెద్దాసుపత్రికి తరలించారు. అనంతరం అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బాధితుడి కుటుంబ సభ్యులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.


