గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి చిరస్మరణీయుడని జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. సోమవారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జెడ్పీ అకౌంట్స్ అధికారి శామ్యూల్ పాల్, పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షురాలు నిర్మల భారతి, ఏవోలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏఎన్యూలో ....
ఏఎన్యూ(పెదకాకాని): అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం శ్లాఘనీయమని వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సోమవారం పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు జరుపుకొన్నారు. వర్సిటీలోని తెలుగుభాషా విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి విభాగాధిపతి ఆచార్య ఎన్వీ కృష్ణారావు అధ్యక్షత వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య ఆర్ శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి.సింహాచలం పాల్గొన్నారు.


