ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ రిచా వర్మ విజ్ఞాన్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
చేబ్రోలు: నాయకత్వం అనేది కేవలం పదవులు పొందడం మాత్రమే కాకుండా బాధ్యత, విలువలు, నిర్ణయ సామర్థ్యం మరియు ఇతరులను ప్రేరేపించే శక్తి కలిగి ఉండడమని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ రిచా వర్మ వివరించారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో శనివారం ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ సెల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది మహిళా దినోత్సవ వేడుకలను గివ్ ఫర్ గెయిన్ – బలమైన, సమగ్ర భవిష్యత్తు కోసం మహిళల సాధికారత అనే ఇతివృత్తంతో నిర్వహించారు. మహిళల విద్య, భద్రత, నాయకత్వ సామర్థ్యం, సంక్షేమం వంటి అంశాల్లో పెట్టుబడి పెట్టినప్పుడు సమాజం మొత్తం పురోగతి, అభివద్ధి మరియు సౌభాగ్యాన్ని పొందుతుందని ఈ ఇతివృత్తం సారాంశమని తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రోగ్రామ్ డైరెక్టర్ రిచా వర్మ మాట్లాడుతూ విద్యాసంస్థలు యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థినులు తమ సామర్థ్యాలను గుర్తించి ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. డాక్టర్ జ్యోత్స్న వినుకొండ మాట్లాడుతూ సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ కొర్రపాటి వాణిశ్రీ మాట్లాడుతూ మహిళలు జీవితంలో పంచుకోవడం, సహనం, రాజీ పడటం, పరిస్థితులకు అనుగుణంగా మెలగడం వంటి విలువలు ఎంతో ముఖ్యమని తెలిపారు. అనంతరం నిర్వహించిన పోటీలలో గెలుపొందిన అధ్యాపకులకు బహుమతులు అందజేశారు. డీఆర్డీవో జాయింట్ డైరెక్టర్, సైంటిస్ట్ ఎఫ్ – అనిత పూరి మోహింద్ర, పద్మశ్రీ, నారి శక్తి అవార్డీ, ప్రజ్వల ఫౌండర్ డాక్టర్ సునీత క్రిష్ణన్, ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్, డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


