గుంటూరు వెస్ట్: కవయిత్రి మొల్ల అసమాన ప్రజ్ఞావంతురాలని, ఆమె రచించిన రామాయణం నిత్యనూతనమని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. కవియిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగాయి. ఈ సందర్భంగా మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జేసీ మాట్లాడుతూ మొల్లమాంబ తెలుగు సాహిత్యానికి చేసిన సేవలను, ఆమె జీవిత చరిత్రను వివరించారు. అచ్చ తెలుగు పదాలతో గద్యరూపంలో సామాన్య ప్రజలకు అర్థం అయ్యేట్లు ఆమె రామాయణాన్ని రచించారని చెప్పారు. ఆమె గొప్పదనాన్ని గుర్తించిన ఆనాటి రాజులు మొల్లమాంబకు కవిరత్న బిరుదుతో సత్కరించారని తెలిపారు. ఆమె పాండిత్యం, అసమాన ప్రజ్ఞ నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, వేములకొండ శ్రీనివాస్, చింతనగుండ వాసు, జె.నాగేశ్వరరావు, యు.వెంకటేశ్వర్లు, రాజవరపు సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన ఉత్పత్తులనే విక్రయించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: మార్కెట్లో సురక్షితమైన, నమ్మదగిన నాణ్యమైన ఉత్పత్తులనే విక్రయించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం బ్రాడీపేటలో మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేసీ మాట్లాడుతూ సురక్షితమైన ఉత్పత్తులతోనే విశ్వసనీయ వినియోగదారులు ఉంటారని చెప్పారు. వినియోగదారులకు రోజువారీ నిత్యావసర వస్తువుల నుంచి అధునాతన డిజిటల్ వస్తువుల వరకు సాంకేతికతతో నడిచే మార్కెట్లో అందుబాటులో ఉండటం వలన అవి సురక్షితంగా, నమ్మదగినవిగా ఉన్నాయని నిర్ధారించుకోవడం ముఖ్యమని అన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం–2019 గురించి ప్రజల్లో అవగాహన కల్పించి, చట్టాన్ని బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ, లీగల్ మెట్రోలాజీ జాయింట్ కంట్రోలర్, వినియోగదారుల ఫోరం సభ్యులు, వినియోగదారుల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


