కిమ్స్ చక్రలో మహిళా ఆరోగ్యంపై
అవగాహన సదస్సు
గుంటూరు మెడికల్: అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకుని గుంటూరు పెదకాకాని మండలం తక్కెళ్లపాడులోని కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్లో మహిళా ఆరోగ్యంపై అవగాహన సదస్సు జరిగింది. సదస్సుకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, డెప్యూటీ మేయర్ షేక్ షజిల, సినీనటి నివేద పేతురాజ్ హాజరై మాట్లాడారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని, తద్వారా దేశం బలంగా ఉంటుందని ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. నివేద పేతురాజ్ మాట్లాడుతూ సమాజంలో నేడు మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని చెప్పారు. మహిళలు తమకు నచ్చిన రంగం వైపు అడుగులు వేయడానికి కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు అందించాలన్నారు. మెడికల్ ఆకాంలజిస్ట్ డాక్టర్ కందుల రామ్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మహిళల ఆరోగ్యంపై తాము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని, ప్రాథమిక దశలోనే అన్ని రకాల క్యాన్సర్లు గుర్తించేందుకు రాయితీతో మహిళలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మహతి మాట్లాడుతూ ఆధునిక జీవనశైలి వల్ల మహిళల్లో ఎక్కువగా రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్లు పెరిగిపోతున్నాయన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని, రొమ్ము క్యాన్సర్ ప్రాథమిక దశలో గుర్తించేలా నానోగ్రామ్ పరీక్ష అందుబాటులో ఉందన్నారు. క్యాన్సర్ సోకిన వారికి రొమ్ము తొలగించకుండానే క్యాన్సర్ కణితులు తొలగించే ఆధునిక ఆపరేషన్లు నేడు అందుబాటులో ఉన్నాయన్నారు. కిమోథెరఫీ, రేడియేషన్ థెరఫీ చికిత్సల్లో కూడా అత్యాధునిక క్యాన్సర్ డ్రగ్స్, ఆధునిక రేడియేషన్ చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చినట్లు వెల్లడించారు. సర్వేకల్ క్యాన్సర్ సోకకుండా వ్యాక్సిన్లు నేడు అందు బాటులో ఉన్నాయని, తొమ్మిదేళ్ల బాలిక మొదలు, 35 సంవత్సరాల వయస్సు వారు వ్యాక్సిన్లు వేసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ సోకకుండా కాపాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


