తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం విఘ్న విమోచక హనుమాన్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో 27 అడుగుల ఏకశిల విఘ్న విమోచక హనుమాన్ ప్రాణప్రతిష్ఠను ఘనంగా నిర్వహించామని తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ, ప్రథమారాధన, తీర్థ ప్రసాద గోష్టి, విశేష తదియారాధనలతో కార్యక్రమాలు ముగిశాయని తెలిపారు. మైహోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు, భక్తు లు పాల్గొని స్వామివారి మంగళాశాసనాలు అందుకున్నారని పేర్కొన్నారు.
తాడేపల్లి రూరల్: కాకినాడలో ఈనెల 11వ తేదీన నిర్వహించే వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు టీజేఆర్ సుధాకర్బాబు పిలుపునిచ్చారు. తాడేపల్లి పట్టణ పరిధిలోని తాడేపల్లి–మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఏకలవ్య విగ్రహాలకు ఆదివారం ఆయన రాష్ట్ర ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్లతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎండీ గోరెబాబు, ఈపూరి ఆదాం, కట్టెపోగు నాగభూషణం, గొర్నిపూడి శుభాకర్, మాతంగి బాబు, కలకోటి చక్రవర్తి, బుర్రా శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెనాలి: పాలనాదక్షుడు కొత్త రఘు రామయ్య ను స్మరించుకుంటూ నూతనోత్తేజంతో ముందుకు వెళదామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి పట్టణం విజయవాడ రోడ్డులోని కెనాల్ బండ్పై ఏర్పాటు చేసిన ప్రముఖ పార్లమెంటేరియన్ కొత్త రఘురామయ్య కాంస్య విగ్రహాన్ని ఆదివారం ఉదయం మంత్రి మనోహర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వార్థం లేని రాజకీయాలు నడిపిన రఘురామయ్య స్మారకార్థం ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన కొత్త సుబ్రహ్మణ్యం, కొత్త రమేష్బాబులను అభినందించారు. కార్యక్రమంలో విగ్రహదాతలు, ఎన్నారైలు పరుచూరి మీనాక్షిదేవి, డాక్టర్ సీతారామాంజనేయులు, రఘురామయ్య కుటుంబసభ్యులతోపాటు వివిధ రంగాల ప్రముఖులు కొత్త హరికుమార్, కొత్త కృష్ణకుమార్, కొత్త శేషుబాబు, బసవయ్య, జెట్టి గుణ తదితరులు పాల్గొన్నారు. తొలుత రఘురామయ్య విగ్రహా నికి పుష్పాంజలి ఘటించారు. హోటల్ గౌతమ్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన రఘురామయ్య సంస్మరణ సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.


