సుమారు 7,102 మంది మహిళల ఫొటోలు మార్ఫింగ్ ప్రశ్నించిన వారిపై టీడీపీ మాజీ సర్పంచ్ దౌర్జన్యం ఆందోళనకు దిగిన మహిళలు మద్దతు పలికిన దుగ్గిరాల జెడ్పీటీసీ సభ్యురాలు
దుగ్గిరాల: మహిళల ఫొటోలను ఐటీడీపీకి చెందిన నాయకుడు తీసి మార్ఫింగ్ చేస్తున్న సంఘటన వెలుగు చూసింది. ప్రశ్నించిన మహిళలపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. ఆగ్రహించిన మహిళలు ఆందోళనకు దిగారు. సేకరించిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన నల్లమామిడి అంజయ్య కళాశాల విద్యార్థినులు, మహిళల ఫొటోలు తీసి మార్ఫింగ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ విద్యార్థిని గుర్తించి శనివారం రాత్రి అంజయ్య ఇంటికి వెళ్లి ప్రశ్నించింది. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ నర్రా శ్రీనివాసరావు అక్కడకు చేరుకుని ‘ఏం చేస్తారు మీరు అంటూ దురుసుగా మాట్లాడి, కేసులు పెట్టినా, వెంటనే తీసుకువచ్చి ఇదే రోడ్డులో తిప్పుతానని’ బెదిరించాడు. సమాచారం తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామాల మహిళలు తెనాలి– మంగళగిరి రహదారిపై ఆందోళనకు దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకోకుండా సుమారు మూడు గంటల పాటు పక్కన ఉన్న చర్చిలో ఉంచారు. గతంలో కూడా ఫొటోలు తీస్తున్న విషయం గమనించి కొందరు మహిళలు అతనికి దేహశుద్ధి చేశారు. అయినా కూడా అతని ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదని బాధితులు అంటున్నారు. కేవలం దళిత పిల్లల్ని ఫొటోలు తీయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు అరుణ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు మద్దతు పలికారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు, మహిళల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాలుగు గంటల అనంతరం పోలీసులు నిందితుడిని దుగ్గిరాల పోలీసుస్టేషన్కు తరలించారు.


