రాహుల్‌ గాంధీపై కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు | Union Minister Termed Rahul Gandhi Mamata As Urban Naxals Details | Sakshi
Sakshi News home page

రాహుల్‌ గాంధీపై కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు

Jul 22 2026 11:37 AM | Updated on Jul 22 2026 11:45 AM

Union Minister Termed Rahul Gandhi Mamata As Urban Naxals Details

న్యూఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిగా రాహుల్‌ తన చర్యలతో రాజ్యాంగ గౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు.

బుధవారం పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో ప్రతిపక్షాలు నిర్వహించిన నిరసనపై స్పందించిన గిరిరాజ్‌ సింగ్‌.. రాహుల్‌ గాంధీ తీరుపై మండిపడ్డారు. ఆయన చర్యలు అత్యంత ప్రమాదకరమైన ఉద్దేశాలను ప్రతిబింబిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

‘‘రాజ్యాంగ పదవిలో ఉంటూ రాహుల్‌ గాంధీ తన చర్యలతో రాజ్యాంగ గౌరవాన్ని దెబ్బతీశారు. ఆయన ప్రవర్తన చాలా ప్రమాదకరమైనది’’ అని గిరిరాజ్‌ సింగ్‌ అన్నారు. ఇతర దేశాల్లో జరిగిన పరిణామాలను అనుసరిస్తూ భారత్‌లో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రాహుల్‌పై ఆరోపణలు చేశారు. ప్రధాని నివాసం సమీపంలో నిరసన చేపట్టడం బాధ్యతారాహిత్యమైన చర్యగా అభివర్ణించారు.

ఇదే సమయంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీపైనా గిరిరాజ్‌ సింగ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. వీరు ప్రజాస్వామ్యాన్ని అనుసరించడం లేదని, “అర్బన్‌ నక్సల్స్‌గా మారుతున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. నిరసనల పేరుతో దేశంలో అశాంతి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

‘‘ప్రధాని నివాసం సమీపంలో ఆందోళన చేయడం చాలా బాధ్యతారాహిత్యం. అక్కడ ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగి ఉంటే.. లేదంటే ఎవరైనా ప్రమాదకర వస్తువులు విసిరి ఉంటే పరిస్థితులు తీవ్రంగా ఉండేవి’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని తాను భావిస్తున్నట్లు గిరిరాజ్‌ సింగ్‌ పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని అన్నారు.

ఇదే సమయంలో సీజేపీ నిరసనలపై కూడా కేంద్ర మంత్రి విమర్శలు చేశారు. ఆందోళనల పేరుతో విద్యార్థులను ముందుపెట్టి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు, ప్రతిపక్షాలు మాత్రం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తున్నామని చెబుతున్నాయి. సీజేపీ ఆందోళనలు, రాహుల్‌ గాంధీ నిరసనల నేపథ్యంలో కేంద్రం–విపక్షాల మధ్య రాజకీయ వివాదం మరింత ముదురుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement