అమెరికాలో చట్టబద్ధంగా స్థిరపడాలని కలలు కంటున్న వేలాది మంది వలసదారులకు భారీ ఊరట లభించింది. గ్రీన్కార్డులు, వర్క్ పర్మిట్లు, పౌరసత్వ దరఖాస్తులను నిలిపివేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనలకు అమెరికా ఫెడరల్ కోర్టు చెక్ పెట్టింది. ఆ ఆదేశాలు చెల్లుబాటు కావని తీర్పు ఇచ్చింది. దీంతో స్వదేశంలోనే అమెరికా అధ్యక్షుడికి మరో పరాభవం ఎదురైనట్లయ్యింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది అమల్లోకి తీసుకొచ్చిన పలు వలస విధానాలపై రోడ్ ఐలాండ్లోని ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ట్రంప్ ప్రభుత్వం "జాతీయ భద్రత" పేరుతో 39 దేశాలకు చెందిన విదేశీయుల గ్రీన్కార్డులు, వర్క్ పర్మిట్లు, పౌరసత్వ దరఖాస్తుల పరిశీలనను నిలిపివేసింది. అంతేకాకుండా ఆశ్రయం (అసైలమ్) కోసం దరఖాస్తు చేసిన వారి కేసులను కూడా నిలిపివేసింది. అయితే ఈ నిర్ణయాలను పరిశీలించిన న్యాయమూర్తి జాన్ మెక్కానెల్.. ప్రభుత్వం తనకు లేని అధికారాలను వినియోగించేందుకు ప్రయత్నించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించి, ఫీజులు చెల్లించి, బయోమెట్రిక్ ప్రక్రియలు పూర్తి చేసి, ఇంటర్వ్యూలకు హాజరైన దరఖాస్తుదారులపై ఇలాంటి ఆంక్షలు విధించడం సరికాదని స్పష్టం చేశారు.
"అమెరికాకు రావాలంటే చట్టాన్ని అనుసరించాలి అని తరచూ చెబుతుంటారు. ఈ కేసులో దరఖాస్తుదారులు అదే చేశారు. అయినప్పటికీ వారికి అన్యాయం జరిగింది. చట్టాన్ని పాటించి అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన దరఖాస్తుదారులను ఇలా నిరవధికంగా వేచి ఉండమని చెప్పలేరు" అంటూ కీలక తీర్పు ఇచ్చింది.
ఈ వివాదానికి మూలం 2025లో వాషింగ్టన్ డీసీలో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై జరిగిన కాల్పులు. ఈ ఘటనలో అరెస్టైన వ్యక్తి అఫ్గానిస్థాన్కు చెందినవాడు కావడంతో ట్రంప్ ప్రభుత్వం జాతీయ భద్రతను కారణంగా చూపుతూ పలు దేశాల పౌరులపై కఠిన ఆంక్షలు అమలు చేసింది. అనంతరం "ట్రావెల్ బ్యాన్" జాబితాను విస్తరించి మొత్తం 39 దేశాలను చేర్చింది. ఈ జాబితాలోని దేశాల పౌరుల గ్రీన్కార్డులు, ఉద్యోగ అనుమతులు, పౌరసత్వ దరఖాస్తులను నిరవధికంగా నిలిపివేయడంతో పాటు ఇప్పటికే ఆమోదించిన కొన్ని కేసులను కూడా మళ్లీ పరిశీలించాలని ఆదేశించింది. ఆశ్రయం కోరిన వారి దరఖాస్తులను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది.
అయితే కోర్టు తాజాగా ఈ నాలుగు ప్రధాన విధానాలను చట్టవిరుద్ధమని తేల్చింది. వలస ప్రయోజనాలపై నిలిపివేత, ఆశ్రయ దరఖాస్తుల నిలిపివేత, ఇప్పటికే ఆమోదించిన కేసుల పునఃసమీక్ష, ట్రావెల్ బ్యాన్ దేశాలకు చెందిన వారిపై ప్రత్యేక ప్రతికూల దృష్టితో వ్యవహరించే విధానాలను రద్దు చేసింది. ఈ తీర్పుతో ఆఫ్రికా, ఆసియా ప్రాంతాలకు చెందిన వేలాది మంది వలసదారులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా గ్రీన్కార్డుల కోసం, ఉద్యోగ అనుమతుల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న వారికి ఇది శుభవార్తగా మారింది.
అయితే ట్రంప్ ప్రభుత్వం ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రస్తుతానికి ఈ తీర్పు ట్రంప్ వలస విధానాలకు గట్టి ఎదురుదెబ్బగా, చట్టబద్ధ వలస మార్గాలను పరిరక్షించే కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. అమెరికాలో వలసలపై జరుగుతున్న రాజకీయ పోరులో ఈ తీర్పు మరో కీలక మలుపుగా మారింది. "జాతీయ భద్రత" పేరుతో విధించిన ఆంక్షలకు కోర్టు అడ్డుకట్ట వేయడంతో.. చట్టబద్ధంగా అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వేలాది మంది ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.


