మూలపాడు యువతి మృతి
మూలపాడు (ఇబ్రహీంపట్నం): అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడుకు చెందిన అట్లూరి ప్రసన్నలక్ష్మి (30) దుర్మరణం పాలైంది. మూలపాడుకు చెందిన రైతు అట్లూరి వసంతరావు, మల్లేశ్వరి దంపతులకు కుమార్తె ప్రసన్నలక్ష్మి, ఒక కుమారుడు ఉన్నారు. ప్రసన్నలక్ష్మిని అమెరికాలో ఎంఎస్ చదివించారు. అక్కడే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. న్యూజెర్సీలో ఉంటున్న ఆమె జాబ్ కాల్లెటర్కు పూజ చేయించేందుకు కారులో స్నేహితులతో కలిసి బయలుదేరింది.
న్యూయార్క్ ప్రాంతంలో రోడ్డుపై సిగ్నల్స్ వద్ద ప్రసన్నలక్ష్మి ప్రయాణిస్తున్న కారును మరోకారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృత్యువాతపడింది. ప్రసన్నలక్ష్మి దుర్మరణం వార్త తెలియడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరో యువతి కూడా మరణించినట్లు తెలిసింది. కారులోని మరో ఇద్దరు గాయపడగా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.


