నందూస్ వరల్డ్ వీసా స్కామ్‌లో బిగ్ ట్విస్ట్?! | Detail Analysis On Nandus World Visa Scam | Sakshi
Sakshi News home page

నందూస్ వరల్డ్ వీసా స్కామ్‌లో బిగ్ ట్విస్ట్?!

Jun 4 2026 7:54 PM | Updated on Jun 4 2026 8:10 PM

Detail Analysis On Nandus World Visa Scam

సాక్షి,హైదరాబాద్‌: ప్రముఖ తెలుగు యూట్యూబర్స్ ‘నందూస్ వరల్డ్’(Nandu's World) దంపతులైన మధుకర్ జాగర్లమూడి, రమా నందన వీసా స్కామ్‌లో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. బాధితులు, ఒకరో ఇద్దరు కాదని వందల్లో ఉండొచ్చనే వాదనలు తెరపైకి వచ్చింది. నందూస్‌ వరల్డ్‌ వీసా స్కామ్‌లో ఒక్కొక్కరుగా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. డెస్టినీ వీసా కన్సల్టెన్సీ పేరుతో వీసాలు, సర్టిఫికెట్‌ ఆఫ్‌ స్పాన్సర్‌ షిప్‌(సీవోఎస్‌) ఇప్పిస్తామని తమ వద్దనుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఇద్దరు దంపతులు తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫ్యామిలీవ్లాగ్స్‌తో ఫేమస్‌ 
యూట్యూబ్‌లో ఫ్యామిలీవ్లాగ్స్‌తో ఫేమస్‌ అయ్యారు. లక్షల మంది అభిమానుల్ని సంపాదించారు. విదేశాల్లో సెటిలై సక్సెస్‌ స్టోరీగా నిలిచారు. ఇప్పుడా కపుల్స్‌ చుట్టూ కోట్ల రూపాయల వీసా స్కామ్‌ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. యూకే వీసా ఇప్పిస్తాం అంటూ లక్షలు వసూలు చేశారా?. బాధితుల డబ్బు తీసుకుని బ్లాక్‌ చేశారా?. వైరల్‌ అవుతున్న వీడియోలు,కేసులు,కౌంటర్‌ ఆరోపణల మధ్య నందూస్‌ వరల్డ్‌ వ్యవహారం ఇప్పుడు హాట్‌ టాపిగ్గా మారింది. అసలు ఈ వివాదం వెనుక కథేంటీ?.

సోషల్‌ మీడియాలో నందు వరల్డ్‌తో ఫేమస్‌యిన రమానందన, జాగర్లముడి మధుకర్‌ దంపతులు ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. యూట్యూబ్‌లో కుటుంబ కథలు, ఫన్నీ వీడియోలు, విదేశీ జీవన శైలిని చూపిస్తూ లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ జంట ఇప్పుడు యూకే వీసా మోసం ఆరోపణల్ని ఎదుర్కొంటోంది.

స్కామ్‌ విలువ రూ.10 కోట్ల నుంచి 20 కోట్లు? 
బాధితుల ప్రకారం.. యూకేలో ఉద్యోగాలు, వర్క్‌ వీసాలు, సర్టిఫికెట్‌ ఆఫ్‌ స్పాన్సర్‌ షిప్‌(సీవోఎస్‌) ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో వ్యక్తి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.25లక్షల వరకు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు. బాధితుల సంఖ్య 50 నుంచి 100 వరకు ఉండొచ్చని, మొత్తం లావాదేవీలు 10 నుంచి 20 కోట్ల వరకు ఉండొచ్చనే ప్రచారం సోషల్‌ మీడియాలో జరుగుతోంది. అత్యంత కీలకంగా వీరి యూట్యూబ్‌ను చూసి చాలా మంది వారిని నమ్మినట్లు బాధితులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల్లా నమ్మి లక్షలు ఇచ్చామని, కానీ తర్వాత తమకు అనుమానాలు మొదలయ్యాయని ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడానికి కారణం ఎన్టీఆర్‌జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన క్రాంతి కుమార్ ఫిర్యాదు. యూకే వీసా రెన్యువల్‌ కోసం రూ.15లక్షలు చెల్లించానని, కానీ వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానాలు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద మధుకర్‌, నందనతో పాటు మధుకర్‌ తండ్రి పేరు కూడా నిందితులు జాబితాలో చేర్చారు. బ్యాంక్‌ లావాదేవీలు, వాట్సాప్‌ చాట్‌, ఫోన్‌ కాల్స్‌ రికార్డింగ్స్‌ ఇలా డాక్యుమెంట్లను బాధితులు పోలీసులకు అందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

కుక్క మొరుగుతుంటే పక్కన కూర్చొని 
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆడియోలు వివాదాన్ని మరింత పెంచాయి. డబ్బులు తిరిగి అడిగిన బాధితులతో మధుకర్‌ పొగరుగా మాట్లాడినట్లు కొన్ని సందర్భాలలో బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘కుక్క మొరుగుతుంటే పక్కన కూర్చొని సమాధానం ఇస్తామా?’ అన్న వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ ఆరోపణల్ని నందన పూర్తిగా ఖండిస్తున్నారు. తమపై వ్యక్తిగత కక్షతో ప్రచారం జరుగుతుందన్నారు. యూకే నుంచి ఇండియాకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు కావాలనే తమపై నెగిటివ్‌ క్యాంపెయిన్‌ చేస్తున్నారని ఆరోపించారు. తమకు ఇండియాలో ఎలాంటి కంపెనీలు లేవని,యూకేలో చట్టబద్ధంగా నమోదైన సంస్థలే ఉన్నాయని నందన చెబుతున్నారు. వైరల్‌ అవుతున్న ఆడియోలు పూర్తిగా ఎడిట్‌ చేసినవేనని, అసలు సంభాషణలు వక్రీకరించారని ఆమె ఆరోపించారు. వీసా ప్రక్రియలో ఆలస్యం జరగడం సహజమని, ఎవరిని మోసం చేసే ఉద్దేశం తమకు లేదని వివరణిచ్చారు.

మరోవైపు నందన తరుఫు న్యాయవాదులు సైతం కంపెనీలు యూకేలో చట్టబద్ధంగా నమోదయ్యాయని, వీసా మంజూరు చేయడం పూర్తిగా యూకే ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమని వాదిస్తున్నారు. కానీ బాధితులు మాత్రం తాము డబ్బులు ఇచ్చినట్లుగా రసీదులు, ఆడియోలు, బ్యాంకు ట్రాన్సాక్షన్‌ని సాక్షాలుగా ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడు అసలు నిజం ఏంటన్నది దర్యాప్తు తేలాల్సి ఉంది.

బాధితుల కన్నీళ్లు.. నందన దంపతుల కుట్ర ఆరోపణలు
ఒకప్పుడు యూట్యూబ్‌లో సక్సెస్‌ సింబల్‌గా కనిపించిన ఈ జంట.. ఇప్పుడ కోట్లాది రూపాయల వీసా స్కామ్‌ కేంద్రంగా మారింది. ఓ వైపు బాధితుల కన్నీళ్లు.. మరోవైపు నందన దంపతుల కుట్ర ఆరోపణలతో సోషల్‌ మీడియా నిండిపోయింది. వైరల్‌ ఆడియోలు, కేసులు దర్యాప్తు ఇప్పుడు ఈ కేసును మరింత వైరల్‌ చేశాయి. సోషల్‌ మీడియా స్టార్‌డమ్‌ నుంచి క్రిమినల్‌ కంప్లయింట్ల వరకు వచ్చిన ఈ వ్యవహారంలో చివరకు నిజం ఎవరివైపు ఉందో తేలాల్సి ఉంది. అప్పటి వరకు నందూస్‌ వరల్డ్‌ వ్యవహారం సోషల్‌ మీడియా నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు హాట్‌టాపిగ్గా కొనసాగేలా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇద్దరు దంపతుల్ని హైదరాబాద్‌ పోలీసుల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తన అమ్మ,భార్య బంగారంతో పాటు కారును అమ్మి యూకే వీసా కోసం ప్రయత్నం చేశామని, ఇందుకోసం మధుకర్‌కు ప్రస్తుత యూకే కరెన్సీ విలువ ప్రకారం రూ.18లక్షలు చెల్లించినట్లు బాధిత దంపతులు మీడియా ఎదుట వాపోయారు. స్పాన్సర్‌ షిప్‌ వీసాతో యూకేకి వెళ్లిన తాము పడరాన్ని పడినట్లు తెలిపారు. తమను నమ్మించి పదే పదే ఫేక్‌ స్పాన్సర్‌ షిప్‌ విధించడంతో యూకే ప్రభుత్వం తమను పదేళ్ల పాటు బ్యాన్‌ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

యూట్యూబ్‌లో తమకు వస్తున్న ఫేమ్‌ను తట్టుకోలేక పలువురు విష ప్రచారం చేస్తున్నారని నందన వీడియోపై బాధిత దంపతులు స్పందించారు. నందన భర్త మధుకర్‌కు డబ్బులు పంపిన సస్కక్రీన్‌ షార్ట్స్‌, మనీ ట్రాన్సాక్షన్‌ ఉన్నాయని తెలిపారు. తమ న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని చెప్పినా పట్టించుకోలేదని మీడియా ఎదుట వారి బాధను వెలిబుచ్చారు. ‌   

Advertisement
 
Advertisement
Advertisement