క్షేత్రస్థాయిలో మూడు సంస్థల కార్యకలాపాలు
అసెంబ్లీ ఎన్నికల క్షేత్రస్థాయి కార్యాచరణ వేగవంతం
రాష్ట్రంలో పార్టీ తరఫున ‘సర్’ పరిశీలిస్తున్న ‘అభీష్ట’
అమిత్షా పర్యవేక్షణలో ‘ఏబీఎం’, ఎన్నికల పనిలో ‘జార్వీస్’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ నాయకత్వం చేపడుతున్న ‘మిషన్ తెలంగాణ’ కార్యాచరణకు అనుగుణంగా...రాష్ట్రంలో వివిధ సర్వే సంస్థలు, ఏజెన్సీల క్షేత్రస్థాయి కార్యకలాపాలు ఊపందుకున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ను వేగవంతం చేయడంలో భాగంగా క్షేత్రస్థాయి అధ్యయనాలు, పరిశీలనలు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితులు, సమస్యలు, ప్రజాకాంక్షలు, ప్రాధాన్యత సంతరించుకున్న అంశాలు పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్రంలో ప్రస్తుతం మూడు సర్వేసంస్థలు క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. పార్టీపరంగా, నేతల పర్యవేక్షణలో, పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగా.. ఇలా వివిధ రూపాల్లో ఇవి పనిచేస్తున్నాయి.
అధికార సాధనకు ‘అభీష్ట’...
పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన ‘అభీష్ట’సంస్థ తాజాగా రాష్ట్ర బీజేపీ కోసం పనిచేయడం ప్రారంభించింది. తొలుత రాష్ట్రంలో సాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు సంబంధించిన అంశాలను ఈ సంస్థ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. త్వరలో హైదరాబాద్లోని మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో...ప్రదానంగా ఈ ఎన్నికల కోసం రాష్ట్రపార్టీ సమన్వయంతో ఈ సంస్థ పనిచేసేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. సర్కు సంబంధించిన పరిశీలనలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్కు ఈ సంస్థ నివేదిస్తున్నట్టు తెలిసింది. సర్లో భాగంగా బీజేపీ బూత్ లెవెల్ ఏజెంట్లు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఈ ప్రక్రియ ఎలా సాగుతోంది? పార్టీపరంగా ఏం చేయాలి? ఏయే అంశాలపై దృష్టి పెట్టాలి? అనే అంశాలపై రాష్ట్ర నేతలకు ఈ బృందం దిశానిర్దేశం చేస్తున్నట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల దాకా ‘అభీష్ట’పార్టీ కోసం పనిచేయనున్నట్టు తెలిసింది.
ఏబీఎం, జార్వీస్
కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్షా కార్యాలయం పర్యవేక్షిస్తున్న ‘అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్’(ఏబీఎం) ఎన్నికల కన్సల్టెన్సీ సంస్థ కూడా గత కొంత కాలంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తోంది. ఈ ఏజెన్సీ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తుండగా.. దీని ద్వారా బీజేపీ ఎజెండాను, పార్టీ ప్రచారం వ్యూహానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ను చేపడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ‘జార్వీస్’అనే మరో కన్సల్టెన్సీ సంస్థ కూడా ఎన్నికల సంబంధిత ముందస్తు తయారీ, కార్యక్రమాల రూపకల్పన, తదితర అంశాలపై దృష్టి పెట్టి విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ కోసం విస్తృతమైన కాల్ సెంటర్లను ఈ సంస్థ నిర్వహిస్తోంది. తెలంగాణలో నమోదైన ఓటర్లను సంప్రదించడం, వారి నుంచి వివిధ అంశాలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవడం వంటి వాటిని చేపడుతున్నట్టు తెలిసింది. బూత్ కమిటీల నియామకం, వాటి పర్యవేక్షణ, క్షేత్రస్థాయి కార్యకర్తల సమీకరణ తదితర అంశాలను ఈ కన్సల్టెన్సీ పర్యవేక్షిస్తోంది. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ఉపయోగించే సరళ్ యాప్ అభివృద్ధి, నిర్వహణతో జారి్వస్ సంస్థకు సంబంధం ఉన్నట్టుగా పార్టీవర్గాల సమాచారం.


