అన్షుల్ (ఫైల్)
అమెరికాలో దుండగుల కాల్పుల్లో హైదరాబాద్వాసి అన్షుల్ మృతి
ఎవరో కావాలనే రప్పించి చంపి ఉండొచ్చని కుటుంబం అనుమానం
మేడ్చల్ రూరల్: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో శుక్రవారం రాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో మేడ్చల్ జిల్లాకు చెందిన అన్షుల్ (28) మృతిచెందారు. ఆయన కుటుంబం గుండ్లపోచంపల్లి డివిజన్లో ఎప్సిలాన్లో ఉంటోంది. శనివారం ఉదయం కుమారుడి మరణవార్త తెలియగానే అన్షుల్ తల్లిదండ్రులు శ్రీనివాస్ గౌడ్, నీలిమ దంపతులు కుప్పకూలిపోయారు. హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేసిన అన్షుల్ ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేశాక కేడబ్ల్యూసీ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తూనే అదనపు సంపాదన కోసం ఖాళీ సమయాల్లో పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు.
ఆ విధుల్లో భాగంగా భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఓ అపార్ట్మెంట్లో పిజ్జా డెలివరీ చేసి తిరిగి వెళ్తుండగా మాస్క్ వేసుకున్న ఇద్దరు దుండగులు వెనుక నుంచి అన్షుల్ను కాల్చి చంపారు. అతని తలతోపాటు మరో రెండు చోట్ల తూటా గాయాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన స్థలంలో ఎలాంటి దొంగతనం జరగలేదని.. అన్షుల్ మృతిపై తమకు అనుమానం ఉన్నట్లు చెప్పారు. ఎవరో కావాలని పిజ్జా డెలివరీ పేరుతో ఇంటి వద్దకు రప్పించి కాల్చి చంపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.


