సాక్షి, హైదరాబాద్: జాగర్లమూడి మధుకర్, రమానందన వ్యవహారంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీలు ఏర్పాటు చేసి సీవోఎస్లు ఇవ్వడం జాగర్లమూడి కపుల్కు వెన్నతో పెట్టిన విద్య అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు నందు దంపతులు వసూలు చేశారు. యూకేలో వీసా, జాబ్స్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు.
యూకేలో సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన నందు దంపతులపై చట్టపరంగా పోరాటానికి రెడీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్తో రమానందన మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇచ్చే అర్హతను నందూస్ వరల్డ్ కిచెన్ కోల్పోయింది. జాగర్లమూడి కంపెనీలకు యూకే సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇవ్వకుండా బ్రేక్ పడింది.
యూకే వీసా కేసులో నందూస్ వరల్డ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వీసా కేసులో బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. నేరం రుజువైతే రమానందన, మధుకర్కు యూకేలో పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. జైలు శిక్ష తర్వాత పాస్పోర్టు రద్దు చేసి ఇండియాకు పంపే అవకాశాలు ఉన్నాయి.


