మంత్రి లోకేశ్ ఒత్తిడితో టీటీడీలో టెండర్ నిబంధనల మార్పు
టీటీడీ ఆస్పత్రుల్లో మందులు, పరికరాల సరఫరాలో కమీషన్లకు స్కెచ్
సరఫరా కంపెనీల టర్నోవర్ తగ్గింపు వెనుక భారీ అవినీతి
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఫైర్
తిరుపతి మంగళం: చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో మంత్రి నారా లోకేశ్ రెడ్బుక్ పాలన సాగిస్తూ ఒక పక్క హింస, మరో పక్క అవినీతి విలయతాండవం చేస్తున్నాయని, ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన టీటీడీని కూడా వదలడంలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. టీటీడీ పాలక మండలి జూలై 14న ఆమోదించిన 134వ తీర్మానంపై స్వతంత్ర విచారణ జరపాలని, మందులు, వైద్య పరికరాల కొనుగోలులో అవినీతి కుట్రను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
టీటీడీ పరిధిలోని ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఇంజెక్షన్లు, శస్త్రచికిత్స పరికరాల కొనుగోళ్లలో అమలులో ఉన్న అర్హత నిబంధనలను నారా లోకేశ్ ఒత్తిడితో పాలక మండలి సడలించడం ద్వారా భారీ అవినీతికి తలుపులు తెరిచారని ధ్వజమెత్తారు. నాణ్యమైన మందులు, ఇంజెక్షన్లు, పరికరాలు, ఇతర వస్తువుల సరఫరాకు టెండర్లలో పాల్గొనాలంటే ఇప్పటివరకు కనీసం రూ.100 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకే అర్హత ఉండేదని, దాన్ని ఇప్పుడు రూ.25 కోట్లకు తగ్గించారని, కొన్ని విభాగాల్లో రూ.15 కోట్ల టర్నోవర్ సరిపోతుందని నిర్ణయించడం వెనక భారీ అవినీతి కుట్ర దాగి ఉందని చెప్పారు.
నాసిరకం మందులు, వైద్య సామగ్రి సరఫరా చేసే సంస్థలకు అవకాశం కల్పించి కమీషన్లు దండుకోవడమే ఈ నిర్ణయం వెనుక అసలు లక్ష్యమని తెలిపారు. రోగుల ప్రాణాలతో మంత్రి లోకేశ్ చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఏమిటా అజ్ఞాత కమిటీ..?
మందుల సరఫరా సంస్థల టర్నోవర్ నిబంధన సడలింపునకు ఒక అజ్ఞాత కమిటీ సిఫారసు చేసిందని టీటీడీ పెద్దలు కల్ల»ొల్లి కబుర్లు చెబుతున్నారని, బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ నేతృత్వంలోని ఆ అజ్ఞాత కమిటీ సిఫారసుల వెనుక ఎవరి హస్తం ఉందని ప్రశ్నించారు. అదే డాక్టర్ జగదీ‹Ùకు స్విమ్స్, చిన్నపిల్లల ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్ల పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించడం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందన్నారు.
టీటీడీ సభ్యురాలిగా ఉన్న ఒక ప్రముఖ ఔషధ తయారీ సంస్థ యాజమాన్య ప్రతినిధి ఈ అజ్ఞాత కమిటీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, లోకేశ్ ఆదేశాల పేరుతో తీర్మానాన్ని ఆమోదించారని చెప్పారు. ఈ తీర్మానంపై కూటమి ప్రభుత్వం స్వతంత్ర విచారణ జరిపి, అసలు కుట్రను బయటపెట్టాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కరుణా కర రెడ్డి డిమాండ్ చేశారు.


