రికవరీ చేసింది కేవలం రూ.23.56 కోట్లు
2024–25లో 2,436 ఘటనల్లో రూ.915.68 కోట్ల మోసం
2025–26లో 522 ఘటనల్లో రూ.371.96 కోట్ల మోసం
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడచిన రెండేళ్లలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులను రూ.1,287.64 కోట్లమేర మోసం చేశారు. ఇందులో రికవరీ చేసింది కేవలం రూ.23.56 కోట్లు మాత్రమే. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 2,436 బ్యాంకు మోసాల ఘటనల్లో రూ.915.68 కోట్లను కాజేయగా ఇందులో కేవలం రూ.15.13 కోట్లను రికవరీ చేశారు. అలాగే 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో వాణిజ్య బ్యాంకుల్లో 522 మోసాల ఘటనల్లో రూ.371.96 కోట్లను కాజేశారు. ఇందులో కేవలం రూ.8.43 కోట్లను మాత్రమే రికవరీ చేశారు.
ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మోసాల ఘటనలను వెంటనే రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత పోలీసులు, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లకు ఆయా బ్యాంకులు నివేదిస్తాయి. ఈ నేపథ్యంలో మోసాలలో చిక్కుకున్న మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి నిర్దిష్ట కాలపరిమితుల్లేవని, అయితే ఏజెన్సీలు వీలైనంత త్వరగా మొత్తాన్ని తిరిగి రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.


