ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)
దద్దుర్లు, చేతులు–కాళ్లు వంకర్లు
ఫుడ్ పాయిజనా? వ్యాక్సిన్ ప్రభావమా?
ఆంధ్రప్రదేశ్, కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నంలో నోబుల్ కాలనీలో ఉన్న షార్కి హోప్ గర్ల్స్ హాస్టల్లో ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఒంటిపై దద్దుర్లు రావడంతో పాటు చేతులు, కాళ్లు వంకర్లు పోవడం వంటి లక్షణాలు కనిపించడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విద్యార్థినులు కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
విద్యార్థినులకు మధ్యాహ్నం సమయంలో బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అందించినట్లు సమాచారం. అనంతరం సాయంత్రం 6.30 గంటల తర్వాత పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మైత్రి ఫౌండేషన్ సంస్థ స్పాన్సర్గా అందించిన ఆహారాన్ని వారు తీసుకున్నారు. తదనంతరం ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో ఘటనకు అసలు కారణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, విద్యార్థినుల అస్వస్థతకు వ్యాక్సిన్ కారణమని హాస్టల్ నిర్వాహకులు ఆరోపిస్తుండగా, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. దీంతో ఆసుపత్రి వర్గాలు, హాస్టల్ నిర్వాహకుల వాదనలు భిన్నంగా ఉండటం చర్చనీయాంశమైంది.
విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి పేర్ని కిట్టు ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే, బాధిత విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. సకాలంలో చికిత్స అందడంతో ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.


