హంద్రీ–నీవా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని విడుదల చేయని చంద్రబాబు సర్కార్
కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా యథేచ్ఛగా నీటిని తరలించుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం
ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్లలోకి పెరిగిన వరద
సాక్షి, అమరావతి: ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం ప్రాజెక్టు నిల్వ కనీస నీటి మట్టాన్ని దాటింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 1,49,917 క్యూసెక్కులు చేరగా, నీటి నిల్వ 855.1 అడుగులలో 92.04 టీఎంసీలకు చేరుకుంది.
⇒ శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 854 అడుగులు. అయినప్పటికీ అటు హంద్రీ–నీవా, ఇటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయలేదు.
⇒ ప్రాజెక్టులో ఎడమ వైపు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా రోజుకు 1,600 క్యూసెక్కుల చొప్పున గత నెల 25 నుంచి (ఆ రోజున 41.46 టీఎంసీలు నిల్వ) తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా తరలిస్తూ– ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నీటిని సరఫరా చేస్తోంది.
⇒ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న జూరాల నుంచి కుడి, ఎడమ కాలువలు.. కోయిల్సాగర్, భీమా, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆయకట్టుకు నీళ్లందిస్తోంది.
⇒ రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల తాగునీటికీ ఇబ్బందులున్నప్పటికీ... హంద్రీ–నీవా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు చంద్రబాబు సర్కార్ నీటిని విడుదల చేయకపోవడంపై రైతులు, రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు.
ఆల్మట్టిలోకి పెరిగిన వరద..
⇒ మహారాష్ట్ర, కర్ణాటక పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన సోమవారం వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యాంలోకి 1,25,855 క్యూసెక్కులు చేరుతుండగా..స్పిల్ వే, విద్యుత్ కేంద్రాల ద్వారా 1,28,417 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
⇒ నారాయణపూర్ డ్యామ్లోకి 1,28,954 క్యూసెక్కులు చేరుతుండగా, స్పిల్ వే గేట్లు, విద్యుత్ కేంద్రాల ద్వారా 1,23,364 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
⇒ ఎగువ నుంచి వస్తున్న వరదను చూస్తే మరో మూడు రోజులు శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇదే రీతిలో నీటి ప్రవాహం కొనసాగనుంది.


