ప్రజల సొమ్ముతో ఇది అవసరమా అంటూ చంద్రబాబు తీరును విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు
గిరిజనుల సంప్రదాయ నృత్యాన్ని చంద్రబాబు ఈవెంట్ మేనేజ్మెంటుగా మలచుకోవడంపై నెట్టింట ఆగ్రహావేశాలు
సీఎం తీరును తప్పుబడుతూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న పోస్టులు
తమ పవిత్ర నృత్యాన్ని ప్రచారం కోసం వాడుకోవడంపై గిరిజన సంఘాల మండిపాటు
సాక్షి ప్రతినిధి, విజయనగరం/ సాక్షి, అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్ను, ఆరుకోట్ల ప్రజలను... ముఖ్యంగా గిరిజన సమాజాన్ని అవమానించారు. మీరు తప్పనిసరిగా క్షమాపణలు చెప్పాలి’’ అంటూ మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఎక్స్లో చేసిన పోస్టు వైరల్గా మారింది. గిరిజనులకు పవిత్రమైన థింసా నృత్యాన్ని చంద్రబాబు తన ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం వాడుకోవడంపై జాతీయ స్థాయిలో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంలో 13 వేల మంది గిరిజన బిడ్డలతో థింసా నృత్యాన్ని ఒక మెగా ఈవెంట్గా ఏర్పాటు చేసి, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని, సంప్రదాయాలను అవమానించారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై రాష్ట్ర, జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

థింసా నృత్యం..గిరిజన బిడ్డలు ప్రదర్శించే ప్రసిద్ధ జానపద నృత్యం..ఐక్యతకు సంస్కృతికి ప్రతీక. శతాబ్దాలుగా వారసత్వంగా వస్తోంది.సమయం, సందర్భం లేకుండా వీధుల్లో ప్రదర్శించేది కాదు. గిరిజనుల పండుగలు, ప్రత్యేక రోజుల్లో ప్రదర్శించే పవిత్ర కార్యక్రమం.అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా పేరు కోసం, భోగాపురం విమానాశ్రయం క్రెడిట్ చోరీ కోసం చంద్రబాబు ప్రభుత్వం మొత్తానికి మెగా ఈవెంట్గా ఈ థింసా నృత్యాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయంలో జాతీయ స్థాయిలో అక్షింతలు ఎక్కువయ్యాయి. గిరిజనుల సంప్రదాయ నృత్యాన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం ఇలా ప్రదర్శించడంపై గిరిజన సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బాబు తీరును దుయ్యబడుతున్న సోషల్ మీడియా
జాతీయ మీడియా జర్నలిస్ట్ కదంబిని శర్మ, జాతీయ మీడియా కార్టూనిస్ట్ సతీష్ ఆచార్యతో సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో నిలదీశారు. రూ.కోట్లు ఖర్చు చేసి ఇలాంటి కార్యక్రమాలు అవసరమా. ప్రజాధనాన్ని ఇలా వృథా చేస్తారా అంటూ ఇంకొందరు.. పాపం అడవి బిడ్డలను ఇబ్బంది పెడుతున్నారు అంటూ మరికొందరు, ప్రభుత్వ ప్రచార యావను నిలదీస్తూ పోస్టులు పెట్టారు. వేలాదిమంది బిడ్డలను గిరిజన ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వారికి సరైన వసతి సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బందుల నడుమ రాత్రి పగలు శిక్షణ పేరుతో ఇబ్బంది పెట్టి చంద్రబాబు ప్రభుత్వం పబ్బం గడుపుకుందంటున్నారు. ఇదంతా కేవలం ప్రజాధనంతో చేపట్టిన ప్రచారం తప్ప దీనివల్ల గిరిజన సమాజానికి ఏం ప్రయోజనం అంటూ ఎక్స్లో పెడుతున్న పోస్టులకు ప్రభుత్వం నుంచి సమాధానం కరువైంది.


