ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల లేఖ
సమ్మె సమయంలో ఇచ్చిన హామీలన్నీ గాలికి
ప్రతి నెలా రూ.170 కోట్ల విడుదల ఉత్తమాటే
ప్రభుత్వం రూ.2,500 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాలి
బకాయిలు చెల్లించకపోగా నిబంధనల పేరిట మరింత ఒత్తిడి
సాక్షి, అమరావతి: నిరుపేద, మధ్య తరగతి ప్రజల ఆపద్భాందవి ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చే చంద్రబాబు సర్కారు కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి. బకాయిల కోసం సమ్మె చేసిన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా అదనపు నిబంధనలు విధిస్తూ ప్రభుత్వం తమపై మరింత ఒత్తిడి పెంచుతోందని నెట్వర్క్ ఆస్పత్రులు మండిపడుతున్నాయి. ఇలా అయితే వైద్య సేవలు కొనసాగించలేమంటూ ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) ఆరోగ్యశ్రీ సీఈవోకు సోమవారం లేఖ రాసింది. ఇప్పుడున్న దుర్భర పరిస్థితిలో సేవలు నిలిపేయడం మినహా తమకు మరే ఇతర మార్గం లేదని ప్రభుత్వానికి ‘ఆశ’ స్పష్టం చేసింది.
భారీగా పెండింగ్ బకాయిలు..
చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.3,700 కోట్ల మేర బకాయిలు పెట్టడంతో ఈ ఏడాది ఏప్రిల్లో యాజమాన్యాలు సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారితో చర్చలు నిర్వహించిన ప్రభుత్వం బకాయిలన్నీ వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) చేస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా ప్రతి నెలా రూ.170 కోట్ల మేర ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లిస్తామని తెలిపింది. ఈ హామీలతో నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె విరమించాయి. ఆరోగ్యశ్రీ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఆరోగ్యశ్రీ ట్రస్ట్తో ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు అప్పు చేయించింది. ఆ బిల్లుల మంజూరులోనూ మెలిక పెట్టి నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన దాంట్లో 8 శాతం మేర కోత పెట్టింది. అయితే సమ్మె విరమించిన నాటి నుంచి ఇప్పటి వరకూ ప్రభుత్వం ఏ నెలా తమకు రూ.170 కోట్లు చెల్లించలేదని ఆశ స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి రూ.2,500 కోట్లకుపైగా బిల్లులు రావాల్సి ఉందని చెబుతోంది.
బకాయిలు చెల్లించకపోగా షరతులు..
ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలు పెట్టడంతో ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారిందని యాజమాన్యాలు వాపోతున్నాయి. వర్కింగ్ క్యాపిటల్కు అప్పు పుట్టడం లేదని పేర్కొంటున్నాయి. వైద్యులు, సిబ్బంది జీతాలు, మందులు, సర్జికల్స్ కొనుగోలు, రోజువారీ నిర్వహణకు పెద్ద యుద్ధం చేస్తున్నామని చెబుతున్నాయి. ఇదిలా ఉండగా హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ (హెచ్పీఆర్) లేని ఆస్పత్రులకు ఈ నెల 10వతేదీ నుంచి ప్రీ–అథరైజేషన్స్ (రోగులకు చికిత్సలు చేయడానికి పెట్టే ప్రతిపాదన) నిలిపేస్తామని ఇటీవల అన్ని ఆస్పత్రులకు ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. అసలే బకాయిలు చెల్లించకపోగా అదనంగా నిబంధనలు రుద్దుతూ ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితి సృష్టిస్తోందని యాజమాన్యాలు సీఈవోకు రాసిన లేఖలో మండిపడ్డాయి. ప్రభుత్వంతో కలసి పని చేయడానికి తాము సిద్ధంగానే ఉన్నా బిల్లులు చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందించగలమని నిలదీస్తున్నాయి.
నెట్వర్క్ ఆస్పత్రుల ప్రధాన డిమాండ్లు ఇవీ..
– తక్షణమే రూ.600 కోట్ల బిల్లులు విడుదల చేయాలి.
– ఇకపై నెలవారీ చెల్లింపులను క్రమబద్ధంగా చేపట్టాలి.
– మిగిలిన బకాయి నిధుల విడుదలకు స్పష్టమైన, కాలపరిమితితో కూడిన షెడ్యూల్ ఖరారు చేయాలి.
– సమస్యల పరిష్కారం కోసం అత్యవసర సమావేశం నిర్వహించాలి.
– పెండింగ్ బకాయిలు చెల్లించే వరకూ హెచ్పీఆర్తో ముడిపడిన ప్రీ–అథరైజేషన్ల నిలిపివేత ప్రతిపాదన వాయిదా వేయాలి.


