నాగార్జున సాగర్–శ్రీశైలం అభయారణ్యంలో రెండు రోజుల వ్యవధిలో రెండు పులులు మృతి
పులి కాళ్లు తెగిపోయినా, గోళ్లు మాయమైనా పట్టించుకోని ప్రభుత్వం
కమిటీలతో సరిపుచ్చుతున్న డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్
క్షేత్రస్థాయిలో పటిష్టత, రక్షణ చర్యలపై అనుమానాలు
అటవీశాఖను పట్టిపీడిస్తున్న వాచర్ల కొరత
సాక్షి, అమరావతి: పెద్ద పులుల సంరక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసిందా, పులుల వరుస మరణాలను పట్టించుకోవడం లేదా అనే ప్రశ్నలకు సమకాలీన పరిస్థితుల నుంచి అవును అనే సమాధానమే వస్తోంది. దేశంలోనే పెద్ద పులుల అభయారణ్యాల్లో ఒకటైన నాగార్జునసాగర్ – శ్రీశైలం పరిధిలో పులుల దుస్థితి ఆందోళన కలిగిస్తోంది. గత నెల 29న నంద్యాల జిల్లా నందికొట్కూరు రక్షిత అటవీ ప్రాంతంలో తొమ్మిదేళ్ల ఆడ పులి కళేబరం లభించగా, రెండు రోజుల వ్యవధిలో మార్కాపురం జిల్లా గుండ్లకమ్మ పరిధిలో మరో పులి మృతదేహం బయటపడడం వాటి దుస్థితిని, ప్రభుత్వ నిర్లకాŠష్య్న్ని బయటపెట్టినట్టయింది. గుండ్లకమ్మ పరిధిలో మృత్యువాతకు గురైన పులి కాళ్లు తెగిపోయి ఉండడం, గోళ్లు మాయం కావడాన్ని పరిశీలిస్తే వేటగాళ్లు పన్నిన ఉచ్చు అని అర్థం కాని అంశమేమీ కాదు.
పొంతన లేని పవన్ కళ్యాణ్ ప్రకటన...
ఇక అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా గత నెల 29వ తేదీన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నాగార్జునసాగర్ – శ్రీశైలం, శేషాచలంలో కలిపి 68 పులులు, 11 పిల్లలు ఉన్నాయని, ఆరోగ్యకరంగా పెరుగుతున్నాయని తెలిపారు. పులుల వేటను నివారించేందుకు శిబిరాలను 150కి పెంచుతున్నామని డ్రోన్లు, కెమెరా ట్రాప్లు, ఇతర టెక్నాలజీతో నిఘా పటిష్టం చేశామని గొప్పగా ప్రకటించారు. ఈ ప్రకటనకు మరుసటి రోజు నందికొట్కూరు పరిధిలో పులి కళేబరం బయటపడటం గమనార్హం.
గతంలో జరిగిన మరో ఘటనలో... నల్లమల ప్రాంతంలో ఏడాది వయసు ఉన్న సఖి అనే పులి పిల్లను చంపి చర్మం తీసుకెళ్లారు. వేటగాళ్లు పులులను చంపడానికి ఉచ్చులు పన్నుతున్నారని అప్పట్లోనే గుర్తించారు. దీని వెనుక పులుల గోళ్లు, చర్మాల స్మగ్లింగ్ రాకెట్ ఉందని తెలిసినా ప్రభుత్వం మిన్నకుండిపోవడం అనుమానాలకు తావిచ్చింది.
శాఖను సరిదిద్దిన పరిస్థితులు ఏవి...
వరుసగా రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి హడావుడిగా విచారణకు ఆదేశించారు. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని, ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలని ఉత్తర్వులు ఇచ్చారు తప్ప ముందస్తు నివారణ చర్యలు ఫలితమివ్వలేదని ఒప్పుకున్న దాఖలాలు లేవు.. శాఖను సరిదిద్దిన పరిస్థితులు లేవు.
వేట నిరోధక శిబిరాలు, డ్రోన్లు, కెమెరా ట్రాప్లు క్షేత్రస్థాయిలో అమలుపై సందేహాలు లేకపోలేదు. బీట్ ఆఫీసర్లు, వాచర్ల కొరత అటవీ శాఖను పట్టిపీడిస్తోంది.
రెండు నెలల్లో దీర్ఘకాలిక ప్రణాళిక ఇవ్వాలని కమిటీకి గడువు పెట్టి సర్కారు చేతులు దులుపుకుంది. ఐదు రోజుల కిందట గొప్పగా ప్రకటించిన సంరక్షణ మోడల్, మూడు రోజుల్లోనే ఉత్తిదేనని తేలిపోయింది. దీంతో పులుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.


