అబుదాబి భారత రాయబార కార్యాలయంలో జూన్ 13, 2026న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా సాంస్కృతిక శోభతో నిర్వహించారు. ఈ వేడుకలో తెలుగువారి ఐక్యత, తెలంగాణ సంస్కృతి, జానపద వైభవం, చిన్నారుల ప్రతిభ—అన్నీ ఒకే వేదికపై అద్భుతంగా ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జార్జీ జార్జ్ , గౌరవ అతిథిగా వి. ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు. వివిధ భారతీయ సంఘాల ప్రముఖులు.. ఇండియా సోషల్ సెంటర్ నుంచి బిజీ థామస్, లింసన్, బీహార్, జార్కండ్ సమాజ్ దివాకర్, ఉత్తర ప్రదేశ్ సమాజ్ వివేక్, తెలుగు అసోసియెషన్ రమేష్, ఐఎఫ్సీఏ నుంచి వినాయక్ అవాటె, మహారాష్ట్ర మండల్ నుంచి సంజయ్, ఇటిసిఏ నుంచి కిరణ్ కుమార్, సంస్కృతీ నుంచి రాజశేఖర్, తల్లిదండ్రులు, పిల్లలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమం తెలంగాణ డప్పుల స్వాగతంతో ప్రారంభమై, దీపప్రజ్వలన, అరబిక్, భారత జాతీయ గీతాలు, తెలంగాణ రాష్ట్ర గీతంతో కొనసాగింది. అనంతరం డా. అందె శ్రీ, తెలంగాణ ఉద్యమ అమరులకు ఒక నిమిషం మౌనం పాటించారు.
తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజా శ్రీనివాసరావు ఐతా స్వాగత ప్రసంగం అందిస్తూ ప్రవాస తెలంగాణవాసుల ఐక్యత, సంస్కృతి పరిరక్షణ, యువతలో నాయకత్వ వికాసం వంటి అంశాలపై ప్రేరణాత్మకంగా మాట్లాడారు. చివరగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి అధ్యక్షులు రాజా శ్రీనివాసరావు ఐతా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


