సాక్షి, విశాఖ: టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీ అని మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. ఒక మహిళను టీడీపీ మంత్రి వేధించడం దారుణం. కూటమిది మంత్రి వర్గమా లేక వేధింపుల వర్గమా అనే అనుమానం కలుగుతోంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ మంత్రిని వెంటనే భర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి స్థానంలో ఉన్న ఓ వ్యక్తి.. ఎన్ఆర్ఐ మహిళను వేధించడమేంటి?. తన సేవల కోసం వివరించడానికి ఒక మహిళ తన టీమ్తో వస్తానంటే ఆమెను మాత్రమే సదరు ఒంటరిగా రమ్మని చెప్పారంట. వెంటనే ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలి. టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీ. ఆ మంత్రిపై కేసు పెట్టి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కూటమి నేతలు మన రాష్ట్ర పరువును విదేశాల్లో కూడా తీస్తున్నారు. మహిళల గౌరవం విషయంలో ఇంత జరిగినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?.
చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే ఆ మంత్రిని వెంటనే భర్తరఫ్ చేయాలి. ఇంత పెద్ద తప్పు చేసిన మంత్రిని రోడ్డుపై నడిపిస్తారా?. మేక, కోడిని కోస్తే మా పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి రోడ్డుపై నడిపించారు. ఇప్పుడు ఈ మంత్రి విషయంలో ఏం చేస్తారు?. కేబినెట్లో ఉన్న ముగ్గురు మహిళా మంత్రులు ఆ వేధింపుల మంత్రిని మెడ పట్టుకొని బయటకు గెంటేసే దమ్ముందా?. మహిళలపై ఈగ వాలితే నేనుంటా అన్న పవన్ కళ్యాణ్ ఏమయ్యారు?. ఈ విషయంలో ఎందుకు స్పందించలేదు.
ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకపోగా వేరే దేశంలో ఉన్న తెలుగు మహిళలను మంత్రులు వేధిస్తున్నారు. కూటమి పాలనలో అడుగుకొక కీచకుడు ఉన్నాడు. మా ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు పెట్టడం కోసం టీడీపీ నేత తన భార్య బట్టలు చింపేసాడు. అరవ శ్రీధర్ విషయంలో కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా చర్యలు ఉండవని అంతా అనుకుంటున్నారు. ఆ మంత్రి పేరు బయటపెట్టాలి.. కేసు పెట్టాలి.. మంత్రివర్గం నుంచి ఆయన్ను భర్తరఫ్ చేయాలి. ఒక ఎన్ఆర్ఐ మహిళ తన ఆవేదన చెప్పుకుంటుంటే టీడీపీ సైకోలు పోస్టులు పెట్టి ఆమెను వేధిస్తున్నారు అంటూ మండిపడ్డారు.


