ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ సమావేశాలలో ఏమని చెబుతుంటారో కాని, ఎల్లో మీడియాలో మాత్రం వచ్చే కధనాలు చూస్తే మాత్రం ఆయన ఇలా మాట్లాడడమేమిటా అనిపిస్తుంది. సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా , ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిని ఇంతలా కించపరిచేలా ప్రసంగాలు చేస్తున్నారంటే అది ఆయనలోని భయం తెలియచేస్తుంది తప్ప మరొకటి కాదన్న అభిప్రాయం కలుగుతుంది. కొద్ది రోజుల క్రితం పార్టీ యూనిట్ ఇన్జార్జీల శిక్షణ తరగతులలో ఆయన స్పీచ్ ఇచ్చిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఆయనకు కూడా తగులుతాయన్న సంగతి మర్చిపోతున్నట్లుగా ఉంది. జనం ఛీకొట్టినా జగన్ ఇంతే అంటూ చంద్రబాబు మాట్లాడారని ఎల్లో మీడియాకు చెందిన ఒక పత్రిక హెడింగ్ పెట్టింది.
ప్రజల మనోభావాలు గొడ్డలి పార్టీకి పట్టవు అని చంద్రబాబు అన్నట్లు మరో ఎల్లో మీడియా రాసింది. రాజకీయాలలో జనం ఛీకొట్టడం ఏమిటి? గెలుపుఓటములు అన్నవి సహజంగానే ఉంటాయి కదా!అంత మాత్రాన రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను మానివేస్తాయా?ప్రజలలోకి వెళ్లకుండా ఉంటాయా?జగన్ శ్రీకాకుళం టూర్పై ఆయన తన అసహనం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి ప్రధాని వస్తుంటే, జగన్ రెండు రోజుల ముందు ఈ టూర్ పెట్టుకోవడమని ఆయన ప్రశ్నించారట. అదేమిటి? ఈ కార్యక్రమానికి, జగన్ యాత్రకు సంబంధం ఏమిటి?అసలు సమస్య జగన్ కు జనం విపరీతంగా రావడం అన్నమాట. తమ సభలకు జనాన్ని బస్ లలో తరలించాల్సి వస్తుంటే జగన్ కు స్వచ్చందంగా ప్రజలు వస్తుండడం ఏమిటని ఆయనకు అనిపించవచ్చు.
భోగాపురం సభకు జనాన్ని తీసుకురావడానికి వందల బస్సులు పెట్టడాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. జగన్కు జనంలో అంత విలువ,ఆదరణ ఉందేమిటన్నదే ఆయన కంగారుగా ఉంది. అది ఆయన బాధ. జగన్ యాత్రకు జనం రాకపోయి ఉంటే, ఇదే చంద్రబాబు ఏమనేవారు!ప్రజలు ఎవరూపట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించేవారా?కాదా? 2024లో ఎన్నికలలో ఏ కారణంతో అయితేనేమి.. వైఎస్సార్సీపీ ఓడిపోయిన మాట నిజమే కావచ్చు. కాని కూటమి అదికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ఎందుకు వ్యతిరేకత తెచ్చుకుంది. ఈ రెండేళ్లకాలంలో జగన్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు పోటెత్తుతున్నారే?దీనిపై ఆలోచించకుండా జగన్ ను తిడితే ఏమి ప్రయోజనం వస్తుంది.
చంద్రబాబు చెబుతున్న దాని ప్రకారం ఏదైనా పార్టీ ఓడిపోతే జనంలోకి వెళ్లకూడదా!మరి తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయింది కదా! అయినా అవకాశం ఉన్నా,లేకపోయినా, కావాలని కల్పించుకుని టూర్లు పెట్టుకుని ఎన్నిచోట్ల చంద్రబాబు అలజడులు సృష్టించారో తెలియదా!ఆయన చేస్తే అది ప్రజాస్వామ్యం.. ఎదుటివారు వెళితే అది ఇంకొకటి అవుతుందా!తెలుగుదేశం పార్టీ1983లో ఆవిర్భావం తర్వాత ఎన్నిసార్లు ఓటమికి గురైందో గుర్తు లేదా! ఉమ్మడి ఏపీలో 1989లో టీడీపీ అదికారం కోల్పోయింది. స్వయంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కల్వకుర్తిలో పరాజయం చెందారు.
ఆయన నుంచి పార్టీని గుంజుకున్న తర్వాత 2004లో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ఓడిపోయిందే!2009లో ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి టిఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నా మళ్లీ ఎందుకు ఓడిపోయింది? రాష్ట్ర విభజన తర్వాత 2019లో ఓడిపోయింది కనుక చంద్రబాబు ప్రజలలోకి వెళ్లకుండా లేరే! పార్టీ క్యాడర్ను ఆయా సందర్భాలలో ఎలా రెచ్చగొట్టారో తెలియదా!మరో మాట చెప్పాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం పులివెందుల నుంచి 1978 నుంచి గెలుస్తూనే వస్తోంది. జగన్ ఒకసారి ఎంపీగా రాజీనామా చేసి తరిగి పోటీచేస్తే 5.45 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
చంద్రబాబు 1978లో చంద్రగిరి నుంచి గెలిచినా, 1983లో ఓడిపోయారు. ఆ తర్వాత అక్కడ నుంచి కుప్పం ను తన స్థావరంగా మార్చుకున్నారు. ఎందుకు సొంత నియోజకవర్గం వదలిపెట్టారో ఎప్పుడైనా చెప్పారా!అందువల్ల చంద్రబాబు తను చేసే విమర్శలు తనకే తగులుతాయన్న సంగతి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది కదా! ఇక ఈ మధ్య టీడీపీ ఎమ్మెల్యేలు కొందరిపై వస్తున్న ఆరోపణలు ఒక ఎత్తు అయితే, కూటమి ప్రభుత్వంపై ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులురెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలు సంచనలంగా ఉన్నాయి.
ప్రభుత్వంలో పెరిగిపోయిన అవినీతిని ఆయన ఎండగట్టారు.బహుశా ఆయనను దృష్టిలో ఉంచుకునేనేమో , పార్టీ టిక్కెట్ ఇచ్చింది కాబట్టే హీరోలు, లేకుంటే జీరోలే అని హెచ్చరించినట్లు అనిపించింది. పార్టీకి నష్టం కలిగించేవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. వరదరాజులరెడ్డి సీనియర్ నేత. ప్రొద్దుటూరు నుంచి పలుమార్లు గెలిచారు. ఆయన పార్టీకి నష్టం చేసేలా మాట్లాడారా? లేక ప్రభుత్వంలోని అవినీతిని ఎత్తి చూపారా?ముద్రగడ పద్మనాభం సంతాప సభలకు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు,నేతలు వెళ్లడంపై కూడా ఆయన అసహనంగా ఉన్నారన్నది తెలిసందే. వారందరి గురించి పరోక్షంగా ఆయన మాట్లాడినట్లు ఉంది. అయితే చంద్రబాబు వ్యాఖ్యలను ఆ ఎమ్మెల్యేలు కూడా అంత సీరియస్ గా తీసుకుంటారా?లేదా?అన్నది చర్చనీయాంశమే.
ఎందుకంటే పార్టీలో, ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో వారికి కూడా బాగానే తెలుస్తుంది కదా!నిత్యం వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అని సంభోధించి ఆత్మానందం చెందుతున్నారేమో తెలియదు. దానికి ప్రతిగా కొందరు వైఎస్సార్సీపీ నేతలు టీడీపీని బూడిద పార్టీ అని, వెన్నుపోటు పార్టీ అని అడ్రస్ చేస్తున్నారు జగన్ పైన, వైఎస్సార్సీపీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చంద్రబాబు అలవాటుగా మార్చుకు్న్నారు. అయినా జగన్ పర్యటనలకు . జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారంటే తన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని చంద్రబాబు అర్ధం చేసుకుంటే మంచిది కదా.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


