కాందిశీకుల కలలపై ‘ఖర్చు’ల కత్తి! | UK Introduces 10000 Pounds Asylum Payback Rules, Refugees May Have To Repay Government Support Costs | Sakshi
Sakshi News home page

కాందిశీకుల కలలపై ‘ఖర్చు’ల కత్తి!

Jun 30 2026 1:41 PM | Updated on Jun 30 2026 3:29 PM

Britain 10000 pounds Asylum Payback Rule Refugees Face Costly Path Residency

బ్రిటన్‌లో అక్రమ వలసల నియంత్రణే లక్ష్యంగా అధికార లేబర్ పార్టీ ప్రభుత్వం కీలకమైన నూతన ఆశ్రయ నిబంధనలను ప్రకటించింది. దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఈ నిర్ణయం ప్రకారం.. భవిష్యత్తులో బ్రిటన్‌లో ఆశ్రయం పొందే, శాశ్వత నివాసం (పీఆర్‌) కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే శరణార్థులు ప్రభుత్వం తమపై చేసే ఖర్చును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి?

బ్రిటన్ హోం శాఖ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, దేశంలో శాశ్వత నివాసం పొందాలంటే అంతకుముందు ప్రభుత్వం తమ వసతి, జీవన భత్యం కోసం ఖర్చు చేసిన 10,000 పౌండ్లు (సుమారు రూ.11 లక్షలు) తిరిగి చెల్లించడం తప్పనిసరి. అయితే ఈ నిబంధనల అమలుపై ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది.

  • భవిష్యత్తులో బ్రిటన్‌కు వచ్చే, ఈ మొత్తాన్ని చెల్లించగల ఆర్థిక స్థోమత ఉన్న వయోజనులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.

  • ఈ నిబంధనలు గతంలో ఆశ్రయం పొందిన వారికి వర్తించవు. అలాగే చిన్నారులకు దీని నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు.

  • శరణార్థులు ఈ డబ్బు చెల్లించడం వల్ల పూర్తిగా పేదరికంలోకి జారిపోకుండా ఉండేందుకు తగిన రక్షణ చర్యలు కూడా చట్టంలో పొందుపరిచారు.

బ్రిటన్ హోం శాఖ అంచనాల ప్రకారం ఆశ్రయం కోరుకునేవారికి తాత్కాలిక వసతి కల్పించేందుకు సగటున ఒక్కో వ్యక్తికి రోజుకు 23.25 పౌండ్లు(సుమారు రూ.2,600), హోటళ్లలో ఉంచితే రోజుకు 144 పౌండ్ల(రూ.16,000) వరకు ఖర్చవుతోంది. దీనికి అదనంగా వారానికి జీవన భత్యం కూడా చెల్లించాల్సి వస్తోంది. గత ఏడాది ఆశ్రయ వసతి, సంబంధిత సాయం కోసం బ్రిటన్ సుమారు 400 కోట్ల పౌండ్లు(సుమారు 44,000 కోట్ల రూపాయలు) ఖర్చు చేయడం గమనార్హం.

ఈ నేపథ్యంలో బ్రిటన్ హోం సెక్రటరీ షబానా మహమూద్ మాట్లాడుతూ.. ‘బ్రిటన్ పన్ను చెల్లింపుదారులపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ ప్రాధాన్యత. ఆశ్రయ సాయం పొందడం కేవలం హక్కు మాత్రమే కాదు, అది ఒక బాధ్యత కూడా. శరణార్థులకు ఆర్థిక స్థోమత చేకూరిన తర్వాత బ్రిటన్ ప్రజలకు ప్రతిగా వారు దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడాలి’ అన్నారు.

రాజకీయ ఉద్రిక్తతలు - లేబర్ పార్టీ వ్యూహం

బ్రిటన్ రాజకీయాల్లో వలసల అంశం అత్యంత సున్నితమైనది. ఎన్నికల్లో ఓటర్ల తీర్పును ప్రభావితం చేసే ప్రధానాంశాల్లో ఇది ఒకటిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఇది స్థానిక ఉద్రిక్తతలు, నిరసనలకు కూడా కారణమవుతోంది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న సెంటర్‌ లిఫ్ట్‌-లేబర్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉందని కొందరు భావిస్తున్నారు. నైజెల్ ఫరాజ్ నేతృత్వంలోని రైట్‌ వింగ్‌-రిఫార్మ్ యూకే పార్టీ దేశంలో రోజురోజుకూ ప్రజాదరణ పొందుతోంది. దేశంలోని సుమారు ఆరు లక్షల మంది శరణార్థులను వెనక్కి పంపించేస్తామంటూ రిఫార్మ్ యూకే ఇస్తున్న హామీలు స్థానిక ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. దీన్ని తిప్పికొట్టేందుకే లేబర్ పార్టీ ఈ చర్యలకు పూనుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇదీ చదవండి: బంగారం ధరలు ఢమాల్‌!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement