breaking news
payback
-
యూవీ పోరాటానికి ‘పే బ్యాక్’ మద్దతు
సాక్షి, హైదరాబాద్: పేబ్యాక్ ఇండియా.. క్యాన్సర్ ఫౌండేషన్ ‘యూవీకాన్’తో భాగస్వామ్యానికి ముందుకు వచ్చింది. తద్వారా సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) ఇనిషియేటివ్గా, ‘పేబ్యాక్ ఇండియా’ క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలకు చికిత్సను అందించేందుకు సహాయ సహకారాలు అందించనుంది. క్యాన్సర్పై అవగాహనను కల్పించేందుకు కృషి చేయనుంది. వివరాలు.. దేశంలోని అతిపెద్ద మల్టీ-బ్రాండ్ లాయల్టీ ప్రోగ్రాం అయిన ‘పేబ్యాక్’ ఇండియా క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లల చికిత్సకు సహాయపడటానికి ‘యూవీకాన్’ క్యాన్సర్ ఫౌండేషన్కు మద్దతిస్తోంది. ఈ ఫౌండేషన్ భారతదేశంలో క్యాన్సర్ నియంత్రణకు విస్తృతంగా పనిచేస్తోంది. ‘యూవీకాన్’ ఫౌండేషన్తో భాగస్వామ్యం కావడంపై ‘పేబ్యాక్’ ఇండియా సీఎంవో రామకాంత్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. యువరాజ్ సింగ్ చేసిన ఈ గొప్ప ప్రయత్నంలో భాగం కావడం తమకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఫౌండేషన్ వెనుక ఉన్న స్ఫూర్తిని, ప్రజలపై దాని ప్రభావాన్ని తాము గుర్తించామన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా క్యాన్సర్కు వ్యతిరేకంగా, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తుకు బాటలు నిర్మించాలనుకుంటున్నామని తెలిపారు. అదే విధంగా 2019లో ‘పేబ్యాక్’ ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన క్రికెటర్ యువరాజ్ సింగ్తో మా సంబంధాన్ని మరింత పెంచుతుంద’ని అభిప్రాయపడ్డారు. ‘యువీకాన్’ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, క్రికెటర్ యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ‘‘పేబ్యాక్ మాతో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలో క్యాన్సర్ వ్యతిరేక పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ రహిత భారతదేశాన్ని నిర్మించాలన్న మా మిషన్లో మరిన్ని కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి మాతో చేరాలని ఆశిస్తున్నాను. మా ఫౌండేషన్ పొగాకు విరమణ కౌన్సెలింగ్ను అందించడంతో పాటు నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లపై దృష్టి సారించి గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని’ తెలిపారు. అలాగే, క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం, జిల్లా స్థాయి సమాజ ఆరోగ్య కేంద్రాలున్నాయి. దేశవ్యాప్తంగా కార్పొరేట్, కళాశాలలు, కమ్యూనిటీ సెంటర్లు, ఆసుపత్రులలో పొగాకు వ్యతిరేక వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. ఈ ఫౌండేషన్ పీడియాట్రిక్ రోగులకు చికిత్సా నిధిని నడుపుతుంది. సంవత్సరానికి రూ. 2 లక్షల వరకు గృహ ఆదాయం ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 50,000 మందికి పైగా పిల్లలు క్యాన్సర్ బారిన పడుతున్నారని ఒక అంచనా. అంతేకాకుండా, మన దేశంలో క్యాన్సర్కు మరణాల రేటు యుఎస్ఎ, యుకె కంటే నాలుగు, ఆరు రెట్లు అధికంగా ఉంటుందని అంచనా వేశారు. ప్రధానంగా అవగాహన లేకపోవడం, ఆలస్యంగా రోగ నిర్ధారణ, సంరక్షణకు సరైన ప్రాప్యత, చికిత్సకు అధిక వ్యయం కావడం వంటి కారణాల వల్ల ఈ వ్యత్యాసం నమోదవుతున్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. భారతదేశంలో క్యాన్సర్ చికిత్సకు సగటున రూ. 4-6 లక్షల మధ్య వ్యయం అవుతోంది. కానీ 85% పైగా జనాభాకు ఆ ఖర్చులను భరించే స్థోమత లేదు. ‘పేబ్యాక్’ ఇండియా గురించి.. భారతదేశంలో అతిపెద్ద మల్టీ-బ్రాండ్ లాయల్టీ ప్రోగ్రామ్ ‘పేబ్యాక్’. ఇది అందులోఏని వంద మిలియన్లకు పైగా సభ్యులకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో అమెరికన్ ఎక్స్ప్రెస్, ఐసీఐసీఐ బ్యాంక్, బిగ్ బజార్, సెంట్రల్, హోమ్ టౌన్, బ్రాండ్ ఫ్యాక్టరీ, హెచ్పీసీఎల్, బుక్ మై షో, క్లియర్ట్రిప్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మరెన్నో భాగస్వాములుగా ఉన్నాయి. భాగస్వాముల విభిన్న పోర్ట్ఫోలియోతో, ‘పేబ్యాక్’ సభ్యులు రోజువారీ షాపింగ్లో పాయింట్లను సంపాదించవచ్చు. ఆకర్షణీయమైన రివార్డుల కోసం వాటిని రిడీమ్ చేయవచ్చు. ‘పేబ్యాక్’ ఇండియా లాయల్టీ ప్రోగ్రామ్లో.. ఉత్తమ భాగస్వామ్యం, సంవత్సరపు ఉత్తమ బిగ్ డేటా అనలిటిక్స్ టీం-2019లో కస్టమర్ ఫెస్ట్ సహా అనేక అవార్డులను అందుకుంది. అలాగే 2018లో బెస్ట్ కార్డ్ బేస్డ్ లాయల్టీ ప్రోగ్రామ్, లాయల్టీ ప్రోగ్రామ్లో కస్టమర్ ఫెస్ట్, నార్త్ ఇండియా బెస్ట్ ఎంప్లాయర్ అవార్డు అందుకుంది. మరింత సమాచారం కోసం www.payback.inను సందర్శించవచ్చు. యూవీకాన్(YouWeCan) ఫౌండేషన్ గురించి.. ‘యువీకాన్’ ఫౌండేషన్ను క్యాన్సర్ను జయించిన భారతీయ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్థాపించారు. లాభాపేక్షలేని సంస్థగా ఇది పనిచేస్తోంది. క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్, చికిత్సపై దృష్టి సారించిన ఈ ఫౌండేషన్ భారతదేశంలో క్యాన్సర్ నియంత్రణపై విస్తృతంగా పనిచేస్తోంది. గత ఐదేళ్ళలో దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టులను అమలు చేసింది. వివిధ రకాల క్యాన్సర్ల కోసం 1,50,000 మందికి పైగా పరీక్షలు చేసింది. క్యాన్సర్ అవగాహన వర్క్షాప్ల ద్వారా 1,25,000 మంది విద్యార్థులను సూచనలు చేసింది. పొగాకు విరమణపై 24,000 మంది పురుషులకు సలహా ఇచ్చింది. రాబోయే రెండేళ్లలో రొమ్ము క్యాన్సర్ కోసం గోవాలో 1,00,000 మంది మహిళలను పరీక్షించేందుకు ఇటీవల గోవా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ‘యూవీకాన్’ ఆశయం, లక్ష్యాలు, కార్యక్రమాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం www.youwecan.orgను సందర్శించవచ్చు. -
6 నెలల్లో వేయి స్తంభాల గుడి పునరుద్ధరణ
► మరో వెయ్యేళ్లు నిలిచేలా వేయిస్తంభాల గుడిని నిర్మిస్తున్నామన్న కేంద్ర పురావస్తు శాఖ ► పునర్నిర్మాణ పనులు మరో 15 రోజుల్లో తిరిగి షురూ ► ఎంసీహెచ్ఆర్డీలో జరుగుతున్న సదస్సులో వెల్లడి ► ఆలయ నిర్మాణ కౌశలం, పునర్నిర్మాణ ప్రక్రియపై అబ్బురపడ్డ విదేశీ ప్రతినిధులు సాక్షి, హైదరాబాద్: ఎనిమిదిన్నర శతాబ్దాల క్రితం నాటి అద్భుత దేవాలయం.. నిర్మాణంలో ప్రత్యేక ఇంజనీరింగ్ నైపుణ్యం.. ఆశ్చర్యపరిచే శాండ్బాక్స్ పరిజ్ఞానం.. గుడికి అనుబంధంగా 10 మీటర్ల ఎత్తుతో, 2,500 కళాకృతులతో రాతి దిమ్మెలతో కూడిన నాట్య మండపం.. మనందరికీ తెలిసిన వరంగల్ వేయి స్తంభాల గుడి ప్రత్యేకతలివి. ఇందులో దెబ్బతిన్న మండపం పునరుద్ధరణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పనులను మరో ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్ఐ) డైరెక్టర్ (కన్జర్వేషన్) రోమెల్ సింగ్ జమ్వాల్ మంగళవారం ప్రకటించారు. ఇప్పటివరకు పునరుద్ధరణకు అడ్డంకిగా మారిన నిధుల సమస్యతోపాటు ఇతర అంశాలను అధిగమించినట్టు తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరుగుతున్న పురావస్తు శాఖ సదస్సులో మంగళవారం ఈ అంశాన్ని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు వ్యవస్థా పకుడు పాండురంగారావు ప్రస్తావించగా.. జమ్వాల్ ధ్రువీకరించారు. 15 రోజుల్లో పనులన్నింటినీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. అత్యంత కచ్చితత్వంతో.. కాకతీయ రాజు రుద్రదేవుడి హయాంలో 1163 సంవత్సరం (అంచనా)లో రూపుదిద్దుకున్న ఈ మండపం ఎలా ఉండేదో ఇప్పుడు ఎలాంటి తేడా లేకుండా అదేరకంగా పునర్నిర్మిస్తున్నట్లు పాండురంగారావు పేర్కొన్నారు. భవిష్యత్తులో చెదిరిపోకుండా 350 గ్రాన్యులార్ పైల్స్ను భూగర్భంలోకి చొప్పించామని, 150 బోరు రంధ్రాల ద్వారా సున్నపు మిశ్రమాన్ని భూపొరల్లోకి పంపి నేల గట్టిపడేలా చేశామ న్నారు. ప్రతి చదరపు మీటరుకు 40 టన్నుల బరువును నిలిపే స్థాయిలో పటుత్వాన్ని పునాదులకు కల్పించి పనులు చేపట్టామన్నారు. రాళ్లను కలిపి ఉంచిన పురాతన ఇనుప పట్టీలు పాడవడంతో.. స్టెయిన్లెస్ స్టీలు పట్టీలను వినియోగించామని చెప్పారు. గిన్నిస్బుక్లో చోటు దక్కే అవకాశం! కనీసం మరో వెయ్యి ఏళ్లS వరకు ఈ మండపం నిలిచి ఉంటుందని పాండురంగారావు భరోసా ఇస్తున్నారు. 1972లో కరువు సంభవించి వరంగల్ పట్టణంలోని చెరువులన్నీ ఎండిపోయినా ఆలయ ప్రాంగణంలోని కోనేరు నిండుగా నీటితో ఉండి ప్రజల దాహార్తి తీర్చిన విషయాన్ని ఆయన సభలో వివరించారు. కాగా.. అత్యంత క్లిష్టమైన నిర్మాణాన్ని విప్పదీసి.. ఎక్కడా సిమెంటు కాంక్రీట్ను వాడకుండా సంప్రదాయ డంగు సున్నం, కరక్కాయ, నల్లబెల్లం, రాతి పొడిలాంటి వాటితోనే పునర్నిర్మిస్తున్న ఈ కట్టడం గిన్నిస్బుక్లో చోటు దక్కించుకునే అవకాశముందని చెబుతున్నారు. అందువల్ల దీనిని గిన్నిస్ బుక్ వారి దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు భావిస్తున్నారు.