ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్కు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అదృశ్యమవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ హైదరాబాద్కు చెందిన మణిదీప్ అనే యువకుడు దాదాపు నెలరోజులకు పైగా కనిపించకుండా పోయాడు. అతని నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించినా సరైన సమాధానం లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్కు చెందిన మణిదీప్ రెడ్డి గుజ్జా ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్కు వెళ్లాడు. లాహ్టి (Lahti) నగరంలో ఉన్న ఎల్యూటీ యూనివర్సిటిలో విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే మే నెల 5వ తేదీ నుంచి కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోయినట్లు తెలుస్తోంది. ఫోన్, సోషల్ మీడియా సహా ఏ మార్గంలోనూ అతనితో సంప్రదింపులు జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
మణిదీప్ అదృశ్యమైన విషయం గురించి కాలేజీ యాజమాన్యాన్ని, సిబ్బందిని పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి గల్లంతైన విషయంపై కాలేజీ నుంచి కూడా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని వారు చెబుతున్నారు.
ఇప్పటికే పలు మార్గాల్లో అతడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్న కుటుంబ సభ్యులు, భారత విదేశాంగ శాఖతో పాటు ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకుని తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీనే హైదరాబాద్కు చెందిన ఓ లాయర్ మణిదీప్ మిస్సింగ్ మీద ఓ ట్వీట్ చేయడం గమనార్హం..
🚨 MISSING IN FINLAND 🇫🇮
Manideep Reddy Gujja has been missing in Finland.
Family and friends are urgently seeking any information regarding his whereabouts.
📍 Last Contacted: May 5, 2026
🎓 University: LUT University
📍 City: Lahti, Finland
Contact +91 78932 87099— Nipun Tulsyan (@NipunTulsyan) June 12, 2026


