కాకినాడలో తాతయ్య పద్మనాభం ఇంట్లో కుటుంబ సభ్యులతో కృష్ణస్వామి కార్తీక్ పద్మనాభం
తల్లిదండ్రులు పుట్టింది భారత దేశంలో.. ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. కాకినాడకు చెందిన తాతయ్య పద్మనాభానికి క్రీడలంటే ఎంతో మక్కువ. జిల్లాలో సీనియర్ క్రీడాకారుడిగా, ఒలింపిక్ సంఘ కార్యదర్శిగా క్రీడారంగానికి ఎనలేని సేవలు అందించారు. తాతయ్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మనుమడు కృష్ణస్వామి కార్తీక్ పద్మనాభం అమెరికా దేశంలోని శాన్ఫ్రాన్సిస్కో రాష్ట్రంలో క్రీడలపరంగా గుర్తింపు తెచ్చుకుని తండ్రి పురిటి గడ్డ కీర్తిని ప్రవాసాంధ్రుడిగా రెపరెపలాడిస్తున్నారు. అమెరికా నుంచి కాకినాడకు ఇటీవల వచ్చిన కార్తీక్ ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా..
కాకినాడకు చెందిన కె.పద్మనాభం, యమునలకు జన్మించిన సంతానం రామకృష్ణ. సాఫ్ట్వేర్ ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడ్డారు. ఆయనకు పద్మజతో వివాహం జరిగింది. రామకృష్ణ, పద్మజలకు 2005లో కృష్ణస్వామి కార్తీక్ పద్మనాభం జన్మించాడు. చిన్నతనం నుంచి క్రీడలపై మక్కువ పెంచుకోవడంతో అమెరికాలో తల్లిదండ్రులు స్విమ్మింగ్, బాస్కెట్బాల్లో శిక్షణ ఇప్పించారు. అనతి కాలంలోనే స్విమ్మింగ్, బాస్కెట్బాల్లో ప్రావీణ్యం సంపాదించి శాన్ఫ్రాన్సిస్కో రాష్ట్రానికి కార్తీక్ ప్రాతినిధ్యం వహించి పోటీల్లో పతకాలు కైవసం చేసుకున్నాడు. పదేళ్ల వయసులో కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించిన మినీ ఒలింపియాడ్ ర్యాలీలో పాల్గొని అందరి మన్ననలు అందుకున్నాడు.

అమెరికాలో స్విమ్మింగ్లో శిక్షణ పొందుతున్న కృష్ణస్వామి కార్తీక్
బాస్కెట్బాల్, స్విమ్మింగ్తో పాటు టెన్నిస్లో కూడా క్రీడా ఓనమాలు కాకినాడలోనే కార్తీక్ నేర్చుకున్నాడు. అమెరికాలో 9 నుంచి 12వ తరగతి వరకు మేరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెయింట్ లూయిస్ కంట్రీ డే స్కూల్లో చదవి అక్కడే బాస్కెట్బాల్ మెరుగైన శిక్షణను కోచ్ ట్రవీస్ వ్యాలీస్ వద్ద తీసుకున్నాడు. తొలిసారి కార్తీక్ సారథ్యంలో ఇంటర్ స్కూల్ స్టేట్ పోటీల్లో చాంపియన్ షిప్ను సాధించారు. తాతయ్య జాతీయస్థాయి బాస్కెట్బాల్ క్రీడాకారుడు కావడం, మనవడు క్రీడా వారసత్వాన్ని అందిపుచ్చుకుని క్రీడల్లో రాణిస్తుండడంతో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఎంఎస్సీ కర్రి పద్మశ్రీ, రెడ్క్రాస్ చైర్మన్, మాజీ ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు వైడీ రామారావులు ఇటీవల కార్తీక్ను అభినందించారు.
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ)


