వైట్హౌస్ ఏఐ సలహాదారు శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా చేశారు. ఈ నెలాఖరున పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ పాలనలో శ్రీరామ్ కీలక పాత్ర పోషించారు. 18 నెలల పాటు ఆయన సేవలందించారు. తాను కొంతకాలం విరామం తీసుకుని,.. ఆ తర్వాత అమెరికా ఎదుర్కొంటున్న ప్రధాన ఏఐ సంబంధిత సవాళ్లపై తిరిగి పని చేస్తానంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కృష్ణన్ ప్రభుత్వంలో తన సేవను జీవితకాలపు ప్రత్యేక హక్కుగా అభివర్ణించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో సేవ చేయడం గౌరవం. ఆయన నాయకత్వం లేకపోతే మనం ఏఐ రేసులో ముందంజలో ఉండేవాళ్లం కాదంటూ ఆయన పేర్కొన్నారు.
వైట్ హౌస్ ఏఐ, క్రిప్టో సలహాదారు డేవిడ్ సాక్స్కు కూడా ఆయన ధన్యవాదాలు తెలుపుతూ.. ఏఐ రంగంలో అమెరికా విజయం సాధించాలనే ఆయన నిరంతర మద్దతు ఎంతో కీలకమైందని.. అది కొనసాగుతూనే ఉంటుందన్నారు. తన పదవీకాలంలో తాను అభివృద్ధి చేయడంలో సహాయపడిన పలు కార్యక్రమాలను కృష్ణన్ ప్రధానంగా ప్రస్తావించారు.
వీటిలో అమెరికన్ ఏఐ యాక్షన్ ప్లాన్'ను రూపొందించడం, ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ ఏఐ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఏఐ యాక్సిలరేషన్ పార్టనర్షిప్లను ముందుకు తీసుకెళ్లడం, 'నేషనల్ ఏఐ పాలసీ ఫ్రేమ్వర్క్' ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కు సహకారం అందించడం, అంతర్జాతీయంగా ఏఐ సదస్సులు, దౌత్యపరమైన చర్చల ద్వారా అమెరికన్ ఏఐ ప్రయోజనాలను ప్రోత్సహించడంలో తన పాత్రను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. కృత్రిమ మేధస్సు వేగవంతమైన పరిణామంగా కృష్ణన్ పేర్కొన్నారు.
చెన్నైలో జన్మించిన కృష్ణన్.. ఎస్ఆర్ఎంఇంజనీరింగ్ కాలేజ్ నుంచి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2005లో అమెరికాకు వెళ్లారు. కృష్ణన్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగారు. ఆయన తండ్రి ఇన్సూరెన్స్ రంగంలో పనిచేశారు. తల్లి గృహిణి. ఆయన 21 సంవత్సరాల వయస్సులో మైక్రోసాఫ్ట్ సంస్థతో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ ఆయన విండోస్ అజూర్ వ్యవస్థకు ఫౌండింగ్ మేనేజర్గా పనిచేశారు.
ట్రంప్ ప్రభుత్వంలో చేరడానికి ముందు, కృష్ణన్ 'ఆండ్రీసెన్ హోరోవిట్జ్' వెంచర్ క్యాపిటల్ సంస్థలో జనరల్ పార్ట్నర్గా ఉన్నారు. అంతకుముందు ఫేస్బుక్, ట్విట్టర్లలో కూడా వివిధ హోదాల్లో పనిచేశారు. ముఖ్యంగా ఎలాన్ మస్క్ 'వార్ రూమ్'లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ నుండి 'ఎక్స్ గా మార్చే ప్రక్రియలో ఆయన సహాయం అందించారు.


