అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నైటా (న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో బేత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్లో ఈ ఉత్సవాలు జరిగాయి.
ప్రవాస తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్ఆర్ఐ ప్రముఖులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, వెంకట్ మారోజు, నారాయణస్వామి పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. మిమిక్రీ కళాకారుడు రమేష్, సింగర్ అద్వైత్ బొందుగుల తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అశోక్ చింతకుంట కొమరం భీమ్ ఏకపాత్రాభినయం అలరించింది. చిన్నారులు అదిరిపోయే ఫ్యాషన్ షోను ప్రదర్శించారు.
ప్రజల ఆంకాక్షలకు అనుగుణంగా ఏర్పాటైన తెలంగాణ మరింత అభివృద్ది జరగాలని, అందుకోసం తమవంతు పాత్రపోషిస్తామని నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల తెలిపారు. నైటా కార్యవర్గం, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, సలహాసంఘం సభ్యులు కుటంబాలతో సహా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.
(చదవండి: ఐరోపాలో ఘనంగా శ్రీ అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు)


